తాజా వార్తలు
పెళ్లి ఇష్టం లేక యువతి ఘాతుకం
Tuesday April 19, 2022

ఓ యువతి తనకు కాబోయే భర్తకు ఫోన్‌ చేసి ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ బైక్‌పై షికారుకు వెళ్లారు. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. చున్నీని అతడి మెడకు చుట్టి కత్తితో గొంతు కోసింది. ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఏకంగా చంపేసేందుకు ప్రయత్నించింది. సోమవారం అనకాపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామానికి చెందిన అద్దెపల్లి రామునాయుడుకు, రావికమతానికి చెందిన వి.పుష్పకు ఈ నెల 4న వివాహ నిశ్చితార్థం జరిగింది. మే నెలలో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తాన్ని నిశ్చయించారు. సోమవారం రామునాయుడుకు పుష్ప ఫోన్‌ చేసి, ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ కలిసి బైక్‌పై బుచ్చెయ్యపేట మండలం అమరిపురి బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. కాసేపు  మాట్లాడుకున్నాక తిరుగు ప్రయాణమయ్యారు.   మార్గమధ్యంలో బైక్‌  ఆపాల్సిందిగా పుష్ప కోరింది. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. రామునాయుడు కళ్లు మూసుకోగా... చున్నీని అతడి మెడకు చుట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. రామునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, ప్రమాదం జరిగిందని, అతను గాయపడ్డాడని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. రామునాయుడు ఆమె చేయి పట్టుకుని ఆపి బైక్‌ ఎక్కించాడు. మెడకు కర్చీఫ్‌ చుట్టుకుని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పాడు. అనంతరం బైక్‌లో రావికమతం పీహెచ్‌సీకి వెళ్లాడు. రామునాయుడు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కేజీహెచ్‌కి తరలించాలని వైద్యులు సూచించారు. అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి, చికిత్స చేయిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. రామునాయుడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు

భారత్ సాయం కోరిన రష్యా
Tuesday April 19, 2022

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్ సాయాన్ని కోరింది. రష్యాకు మరిన్ని మెడికల్ పరికరాలు సరఫరా చేయాలని విన్నవించింది. ఈ అంశంపై ఈ నెల 22న భారత్, రష్యాలకు చెందిన కంపెనీలు వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. భారత్ నుంచి మెడికల్ సప్లయిలు అదనంగా పెంచడంపై ఈ సమావేశంలో ప్రతినిధులు చర్చించబోతున్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరం కోఆర్టినేటర్ రాజీవ్ నాథ్  ఈ విషయాన్ని వెల్లడించారు. మరోపక్క రష్యా మార్కెట్‌లో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఎగుమతులను ఈ ఏడాది 10 రెట్లు పెంచి 2 బిలియన్ల రూపాయలు(26.2 బిలియన్ డాలర్లు)కు చేరుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని రాజీవ్ నాథ్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించే రష్యా బిజినెస్ గ్రూప్ ‘బిజినెస్ రష్యా’ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. యూరప్, చైనాల నుంచి రష్యాకు దిగుమతులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.  ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురవుతున్న రష్యాతో సంబంధాలను యథావిథిగా కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఎగుమతులకు మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా స్థానిక కరెన్సీలలో చెల్లింపులకు ఇరు దేశాలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. కాగా రష్యా నుంచి అదనంగా ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న భారత్‌ను అగ్రరాజ్యం అమెరికాతోపాటు మిత్ర దేశాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

వైసీపీ చర్యలను అడ్డుకుంటాం: సోమువీర్రాజు
Saturday April 16, 2022

వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం ఈ మేరకు పార్టీ ఆఫీసు నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు ఆలయాల నిధులు ఇస్తే  ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమ్మవడి గత సంవత్సరం ఇవ్వలేదు..ఈ సంవత్సరం జూన్ లో ఇస్తామని చెప్పారన్నారు. జిల్లాల విభజన పూర్తి కాగానే నిబంధనలు ప్రకటించారని చెప్పారు.300 యూనిట్లు విద్యుత్ ప్రామీణకం పెడితే ఎలా అని ప్రశ్నించారు.ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారు.. ఈ కారణంగా 60 శాతం మందికి అమ్మవడి  రాదన్నారు. అమ్మవడి తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్థిక బడ్జెట్ హిందూ దేవాలయాలు నుంచి సేకరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని సోమువీర్రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రధాన వార్తలు
మద్యంలో ‘కమీషన్ల కిక్కు’
Tuesday April 19, 2022

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కొత్త’ మద్యం పాలసీ వచ్చింది. ప్రైవేటు దుకాణాలు పోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చాయి. అప్పటివరకూ అందరికీ తెలిసిన పాపులర్‌ బ్రాండ్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఊరూపేరూ  తెలియని కొత్త బ్రాండ్లు వచ్చాయి. ‘అస్మదీయుల తయారీ’ మద్యం మాత్రమే అమ్మడం మొదలుపెట్టారు. పాపులర్‌ బ్రాండ్లు ఏవైనా సరే... ‘మాకు కమీషన్‌ ఇస్తేనే మీ మద్యం కొంటాం’ అని షరతులు పెట్టారు. పది నుంచి 20 శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో బిజినెస్‌ చేసే మేం మీకు కమీషన్లు ఇవ్వడం ఏమిటి’ అంటూ చాలా మద్యం కంపెనీలు రాష్ట్రంలో వ్యాపారం మానుకున్నాయి. పూర్తిగా మూసేయడం ఇష్టంలేని కొన్ని కంపెనీలు కప్పం కట్టి వారి బ్రాండ్లను మళ్లీ మార్కెట్లోకి తెచ్చాయి.   అది కూడా కేవలం రెండు మూడు బ్రాండ్లే.  ఎన్ని కేసులు అమ్మితే అన్నిటికీ కమీషన్‌ సమర్పించుకోవాల్సి రావడంతో... అంతకుముందుతో పోల్చితే 50 శాతం సరుకును మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఒకవైపు భారీ ధరలు... మరోవైపు అంతగా నాణ్యతలేని, కొత్తకొత్త బ్రాండ్లతో మందుబాబుల్లో సర్కారుపై వ్యతిరేకత పెరిగింది. మరోవైపు... ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జోరందుకుంది. ఈ నేపథ్యంలో... గత ఏడాది చివర్లో ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. అక్రమ రవాణా అరికట్టడంతోపాటు ఆదాయం పెంచుకునేందుకు వీలుగా... అన్ని బ్రాండ్లను షాపుల్లోకి తేవాలని భావించింది. సరఫరాకు సిద్ధం కావాలంటూ ఆయా బ్రాండ్ల యాజమాన్యాలకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి సమాచారం కూడా వెళ్లింది. ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా కమీషన్లను కూడా ‘త్యాగం’ చేశారనేలా ప్రచారం జరిగింది. దీంతో దాదాపు రెండేళ్ల కిందట ఆగిపోయిన బ్రాండ్ల కంపెనీలు మళ్లీ ఏపీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ... అంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. కమీషన్‌ కడితేనే సరఫరా అంటూ మెలిక పెట్టడంతో... పాత, పాపులర్‌ బ్రాండ్లు ఆగిపోయాయి.   సందేహాలకు జవాబేదీ? మద్యం అమ్మకాల్లో పారదర్శతను పాటిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతనే ఉండటంలేదు. ‘బ్రూవరీలన్నీ తెలుగుదేశం వాళ్లవే. మేం వచ్చాక కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వనేలేదు’ అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ... అధికారంలోకి రాగానే పాత, పాపులర్‌ బ్రాండ్లు ఎందుకు మాయమయ్యాయి? కేవలం... మూడు పాత బ్రాండ్లకు మాత్రమే ఎందుకు అనుమతిస్తున్నారు? కమీషన్ల వ్యవహారం లేకుంటే... మిగిలిన బ్రాండ్లు ఏపీకి ఎందుకు బైబై చెబుతాయి? ఆ మూడు బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఎందుకు వెళుతున్నాయి? ఈ ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పడంలేదు. జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒక బీర్‌ కంపెనీకి చెందిన బ్రూవరీ గత ఏడాది మూతపడింది. ఇప్పుడు... మళ్లీ అది తెరుచుకుంది. దీని వెనుక ఏం జరిగిందనేదీ ఓ మిస్టరీనే!   ఆగిపోయిన బ్రాండ్లు ఇక తాజాగా లేబుళ్లు రెన్యువల్‌ చేసుకోకపోవడంతో కొన్ని బ్రాండ్ల మద్యం సరఫరా నిలిచిపోయింది. ప్రతి ఏటా ఈ సమయంలో బ్రాండ్ల లేబుళ్ల రెన్యువల్‌ ప్రక్రియ జరుగుతుందని, ఈసారి కొన్ని బ్రాండ్లు రెన్యువల్‌ చేసుకోలేదని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి తెలిపారు. ఆగిపోయిన బ్రాండ్లన్నీ ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

గత ఆర్థిక సంవత్సరంలో 63 శాతం పెరిగిన డీమ్యాట్‌ ఖాతాలు
Saturday April 16, 2022

దేశంలో యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్‌ అకౌంట్లు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంక్షోభ కాలంలో మిగతా ఆర్థిక సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయ ప్రతిఫలాలు అందిస్తుండటం, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ట్రేడింగ్‌ పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎ్‌సఎల్‌) నిర్వహణలోని యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 6.3 కోట్లకు చేరుకుంది. ఆ ఖాతాల కస్టడీ ఆస్తుల (ఏయూసీ) మొత్తం విలువ 37.2 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సడీఎల్‌) నిర్వహణలోని యాక్టివ్‌ డీమ్యాట్‌ అకౌంట్లు 2.67 కోట్లకు పెరిగాయి. వాటిల్లోని ఏయూసీ విలువ రూ.301.87 లక్షల కోట్లుగా ఉంది. మరిన్ని వివరాలు..    2020లో కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి దేశంలో డీమ్యాట్‌ ఖాతాలు 2.2 రెట్లు పెరగగా.. వాటిల్లోని మొత్తం ఆస్తుల విలువ కూడా రెండు రెట్లైంది. కొత్త డీమ్యాట్‌ ఖాతాదారుల్లో అధికంగా యువతే కావడం గమనార్హం.  కరోనా వ్యాప్తితో ప్రపంచవాసుల వ్యయ, పెట్టుబడి అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. దేశంలో సామాన్యులకూ స్మార్ట్‌ఫోన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. పైగా డేటా సేవలూ చౌకగా లభిస్తున్నాయి. దాంతో అప్‌స్టాక్స్‌, జీరోధా వంటి జీరో బ్రోకరేజీ సేవల కంపెనీల ద్వారా ఆన్‌లైన్‌లో డీమ్యాట్‌ ఖాతా తెరిచి ఈక్విటీల్లో ట్రేడింగ్‌ జరిపే ట్రెండ్‌ ఊపందుకుంది.  ఈ-కేవైసీ, ఆధార్‌ ఈ-సిగ్నేచర్‌ వంటి సౌకర్యాలు ఆన్‌లైన్‌లో డీమ్యాట్‌ ఖాతా ఓపెనింగ్‌ ప్రక్రియను సులభతరం చేశాయి.  2020 మార్చి నుంచి గత ఏడాది చివరి వరకు స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 19 శాతం ఎగబాకగా.. మిడ్‌క్యాప్‌ సూచీ 25 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 29 శాతం పుంజుకున్నాయి.  మున్ముందు యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాలు మరింత పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అయితే, కొత్త ఖాతాల వృద్ధి జోరు మాత్రం గత రెండేళ్ల స్థాయిలో ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. 

శ్రీలంకలో తగ్గనున్న ఉత్పత్తి... పెరగనున్న టీ ధరలు
Saturday April 16, 2022

శ్రీలంక ఆర్థిక సంక్షోభం... అంతర్జాతీయ స్థాయిలో తేయాకు వ్యాపారం, వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టీ ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తేయాకు ఎగుమతుల్లో శ్రీలంక ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే తాజా సంక్షోభం కారణంగా శ్రీలంకలో వ్యవసాయానికి 12 నుంచి 14 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో అక్కడ తేయాకు ఉత్పత్తి 15 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని భారత తేయాకు ఎగుమతిదారుల సంఘం పేర్కొంది. ఈ పరిణామాలతో తేయాకు ఎగుమతుల విషయంలో భారత్‌ లబ్ధి పొందనుంది. శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల కొరతను పూడ్చటానికి భారత్‌ సిద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలో భారత్‌కు కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా రష్యా, ఇరాన్‌లతో చెల్లింపుల సమస్య ఏర్పడింది. అంతేగాక ఐరోపా, అమెరికా మార్కెట్లలో మన తేయాకు అంతగా ప్రాచుర్యం పొందలేదు. వీటికితోడు... అంతర్జాతీయ రవాణా చార్జీలు భారతీయ ఎగుమతిదారులకు భారంగా మారాయి. ఈ అవరోధాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మేరకు తేయాకు ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని భారత టీ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. తేయాకు ఎగుమతి వ్యాపారంలో ఉన్న ఓ కంపెనీ ప్రతినిధి ఈ అంశాలపై మాట్లాడుతూ... ‘‘తేయాకు కోసం కొన్ని దేశాలు సంప్రదిస్తున్నాయి. అయితే అమెరికా ఆంక్షల కారణంగా రష్యా, ఇరాన్‌ నుంచి చెల్లింపులు నిలిచిపోతాయేమోననే ఆందోళన ఉంది. దీంతో ఎగుమతుల విషయంలో దూకుడుగా వ్యవహరించలేకపోతున్నాం’’ అన్నారు. భారత్‌ నుంచి తేయాకును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇరాన్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా రష్యా, అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యూకే ఉన్నాయి. అలాగే... శ్రీలంక నుంచి అత్యధికంగా తేయాకును రష్యా, ఇరాక్‌, టర్కీ, ఇరాన్‌, చిలీ దిగుమతి చేసుకుంటున్నాయి. శ్రీలంకలో ఉత్పత్తి తగ్గితే ఆయా దేశాల్లో భారత్‌కు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు...  శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా టీ ధరలు పెరిగే అవకాశం ఉంది. శ్రీలంకలో సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి భారత్‌లోని టీ కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరగడాన్ని కూడా టీ ధరల పెరుగుదలకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.   

బిజినెస్
రంగం సిద్ధం చేస్తున్న జియో
Monday October 19, 2020

టెలికాం రంగంలో మరో సంచలనానికి ముకేశ్‌ అంబానీ  నిర్వహణలోని రిలయన్స్‌ జియో సిద్ధమవుతోంది. రూ. 5,000 కంటే తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రారంభంలో 5జీ ఫోన్‌ ధర రూ.5,000 వరకు పెట్టి నా ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ ధర రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉం టుందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని కంపెనీ అధికార వర్గా లు చెప్పాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ టెలికాం సేవలను సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్ల కనీస ధర రూ.27,000 నుంచి ప్రారంభమవుతోంది. 4జీ సేవలు ప్రారంభమైనా దేశంలో ఇంకా దాదాపు 35 కోట్ల మంది 2జీ ఫీచర్‌ ఫోన్లే వినియోగిస్తున్నారు. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీరిలో కనీసం 20 నుంచి 30 కోట్ల మందిని ఆకర్షించవచ్చని జియో భావిస్తోంది.  4జీ సేవల కోసమూ రిలయన్స్‌ జియో ఇదే వ్యూహాన్ని అనుసరించింది. మిగతా కంపెనీలన్నీ 2జీ సేవల నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి పెడితే, జియో మాత్రం రిఫండబుల్‌ డిపాజిట్‌తో రూ.1,500కే 4జీ  ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసి కోట్ల మంది ఖాతాదారుల్ని సంపాదించింది. ఇపుడు 5జీ స్మార్ట్‌ఫోన్‌ విషయంలోనూ ఇదే వ్మూహం అనుసరించాలని కంపెనీ భావిస్తోంది.   భారత్‌ను త్వరలోనే 2జీ విముక్త దేశంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్టు ముకేశ్‌ అంబానీ గత ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో ప్రకటించారు. దీనికి తోడు ఇటీవల ఫేస్‌బుక్‌, గూగుల్‌, అనేక పీఈ సంస్థలు రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫాంలో దాదాపు రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడులు కుమ్మరించాయి. ఈ నిధుల్లో కొంత భాగాన్ని 5జీ ఫోన్ల కోసం వినియోగించాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఫోన్‌ చెడిందా.. కంగారొద్దు
Saturday January 12, 2019

మా దగ్గర మీరు కొన్న ఫోన్‌ చెడిపోతే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. సమాచారం ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను పరిశీలిస్తాం... అది రిపేర్‌ కావడానికి సమయం పడితే రిపేర్‌ అయ్యేవరకు ఒక ఫోన్‌ వాడుకోవడానికి ఇస్తామంటూ చిన్న సెల్‌షాపులు, షోరూంలు ఈ వారం నుంచి ప్రచారం ప్రారంభించాయి.     సెల్‌ చెడిపోతే అప్పటివరకు ఫోన్ సేవలకు అవాంతరం అవుతుందని, అందువలన వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే పెద్ద షోరూంలలో ఈ సదుపాయం లేదు. చిన్న షాపుల వారు మాత్రమే ఈ ఆఫర్లు పెట్టారు. పెద్ద షో రూంలలో ధరల తగ్గింపు ప్రభా వాన్ని తట్టు కోవడానికే ఈ ఆఫర్లు ప్రకటించారు. దీంతో వినియోగ దారులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకొని వారిని సంతృప్తిని పరచడం ద్వారా వ్యాపార విస్తృతి కోసం దీనిని ప్రకటిస్తున్నారు.

పతనమవుతున్న బెల్లం ధరలు
Wednesday December 12, 2018

అనకాపల్లి: ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో బెల్లం ధరలు రోజు రోజుకి పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీన ఒకటోరకం వంద కిలోలు రూ.3110 పలకగా మధ్యరకం రూ. 2770లకు పలికింది. నల్లబెల్లం రూ.2520లకు పలికాయి. 10న ఒకటోరకం రూ.3060, మధ్యరకం రూ.2740, నల్లబెల్లం రూ. 2490లకు పడిపోయింది. మంగళవారం ఒకటో రకం రూ.3000లకు పడిపోగా మధ్యరకం రూ. 2710కి తగ్గిపోయింది. నల్లబెల్లం రూ.2530కి పెరిగింది. వాస్తవానికి ఒకటో రకం బెల్లం దిమ్మలు తక్కువగా వస్తుంటాయి. దాని తరువాత రకాన్నే ప్రమాణికంగా తీసుకోవాలి. ఆతరువాత రకమైతే రూ.2860లకు పలికినట్టు వర్తకులు చెబుతున్నారు. ఇతర మార్కెట్‌ల్లో ధరలు తక్కువగా ఉండడంతో వాటి ప్రభావం అనకాపల్లి మార్కెట్‌పై కూడా పడుతుందని వర్తకులు చెప్పారు.   అలాగే మహారాష్ట్ర, కర్ణాటక బెల్లాలు ఇతర రాష్ట్ర వర్తకులకు రవాణాతో సహా కలుపుకొని తక్కువ రేటుకు అమ్మకాలు చేయడంతో అనకాపల్లి మార్కెట్‌కు ఆర్డర్లు తగ్గుతున్నాయని వర్తకులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో బెల్లం ధరలు పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా చెరకు పంటకు తెగుళ్లు సోకి ఆర్థికంగా నష్టపోతున్న సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం క్రిస్మస్‌, సంక్రాంతి పండుగల పర్వదినం సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకకు అనకాపల్లి బెల్లా న్ని కొనుగోలు చేసి ఉంటే రైతులకు కొంతైనా గిట్టుబాటు ధర లభించేదని చెరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు తెలిపారు.

రాజకీయాలు
ఇదేనా పాలన?: చంద్రబాబు
Thursday April 15, 2021

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయని.. మదమా.. కొవ్వా అర్థం కావడం లేదన్నారు. ‘అసలు మనుషులేనా... ఇదేనా పాలన?’ అని ప్రశ్నించారు. ఫీరీయింబర్స్‌మెంట్ సకాలంలో ఇవ్వడంలేదని, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనన్నారు.    తిరుపతిలో మీడియా సమావేశంలో గురువారం మాట్లాడిన ఆయన.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల ఇస్తే... వచ్చే నెల ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. కుక్కలు చింపిన విస్తరిలా పాలన మారింది. ఎక్కడికక్కడ అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదు. సీపీఎస్ అతీగతీ లేదు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయింది. పాలనానుభవం లేకపోవడంతో... కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే... ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఎప్పుడూ జరగనిది.. ఈ రెండేళ్ల పాలనలో జరిగాయి. రామతీర్థంలో నాపై కేసులు పెట్టారు. హక్కుగా, బాధ్యతగా వెళితే... నాపై తప్పుడు కేసులు పెట్టారు. తిరుపతిలో రాళ్లు వేస్తారు. నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారు. దొంగతనం జరిగితే మనమే దొంగల్ని పట్టుకోవాలా... మీడియా సమక్షంలోనే జరిగింది. నాసిరకం మద్యంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సీఎం ఆనందిస్తున్నాడు తప్ప... తప్పును సరి చేసుకోవడం లేదు’’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

ధర్మాన కృష్ణదాసు తొలిఫైలుపై సంతకం
Monday July 27, 2020

బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తిస్తున్నాం’... అంటూ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు తొలిఫైలుపై సంతకం పెట్టారు! ‘అబ్బో ఎంత చక్కని నిర్ణయమో’ అని అంతా అనుకున్నారు. అసలు విషయమేమిటంటే... ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయానికి నకలు మాత్రమే! కాకపోతే... అప్పట్లో తెల్ల రేషన్‌ కార్డు అని ఉండేది. ఇప్పుడు దానిని ‘బియ్యం కార్డు’గా మార్చారు. మరికొన్ని పదాల్లో మార్పులు మాత్రమే జరిగాయి! దీనిపైనా ఎవరికైనా సందేహముంటే... చంద్రబాబు హయాంలో రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఉండి ఈ జీవో జారీ చేసిన, ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లంనే అడగొచ్చు!    సహజంగా కొత్త శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రులు... సరికొత్త నిర్ణయాలపై సంతకాలు పెడతారు. కానీ, ధర్మాన కృష్ణదాసు చేత పాత నిర్ణయాన్నే కొత్తగా ‘పునరుద్ఘాటించారు’. రేషన్‌ కార్డును ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలని చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబరు 186 జారీ చేసింది. అనేక అధికారిక సంప్రదింపులు, శాఖలతో మాట్లాడిన తర్వాత 2015 మే 26న ఈ జీవో ఇచ్చారు. దీని ప్రకారం పేదల వద్ద ఉండే రేషన్‌ కార్డునే ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలి. రేషన్‌కార్డు లేని వారికి స్వీయ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా నాలుగేళ్ల కాల వ్యవధితో కొత్తగా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ, పైవేటు సంస్థలు, కార్పొరేషన్‌లు, సంక్షేమ పథకాలు అమలు చేసే విభాగాలు, బ్యాంకులు, ఉద్యోగ సంస్థలు ఎలాంటి నిబంధనలు పాటించాలో అందులోనే సవివరంగా చెప్పారు. ఇది ఇచ్చిన రెండేళ్ల తర్వాత సర్కారు మరో జీవో 229 జారీ చేసింది.   అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ ఈ జీవోను జారీ చేశారు. 186 జీవోను ట్రూస్పిరిట్‌తో అమలు చేయడం లేదని, ఇంకా అనేక శాఖలు, విభాగాలు ఆ జీవో సారాంశాన్ని అర్థం చేసుకోలేదని అందులో తెలిపారు. పాత జీవోలో ఒక్క పదం కూడా మార్చకుండా ‘రేషన్‌ కార్డే పేదలకు ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌’ అని పునరుద్ఘాటించారు.  దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.  వెరసి... రేషన్‌ కార్డును ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తించాలని చంద్రబాబు హయాంలోనే రెండు జీవోలు జారీ అయ్యాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత, ఇదే అంశంపై జగన్‌ సర్కారు జీవో 205ను జారీ చేసింది. గతంలో ఇచ్చిన 186, 229 జీవోలను తొక్కిపెడుతూ ఇదే ఫ్రెష్‌ అనేలా కలరింగ్‌ ఇచ్చారు. ఇందులో మారింది రెండే అంశాలు! ఒకటి... రేషన్‌కార్డు స్థానంలో బియ్యం కార్డు అని పెట్టారు. రెండు... ‘‘ప్రజలు తమ  విలువైన సమయం, పనులను మానుకొని ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా చేస్తున్నాం’’ అని జీవో 186లో పేర్కొనగా... ‘‘ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల జారీ అతిపెద్ద పనిగా మారింది. రెవెన్యూ యంత్రాంగం శక్తి అంతా దానికే డైవర్ట్‌ అవుతోంది. అందుకే బియ్యం కార్డే ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌గా ఇస్తున్నాం’’ అని కొత్త జీవోలో రాసుకొచ్చారు. ఇక మిగిలిన అంశాలన్నీ సేమ్‌ టు సేమ్‌. గతంలో ఇచ్చిన జీవోలు ట్రూ స్పిరిట్‌తో అమలుకాలేదన్న అంశాన్ని కూడా ఇందులో పునరుద్ఘాటించారు.

శిశుపాలుడిలా కేసీఆర్ తప్పులు..
Tuesday July 07, 2020

శిశుపాలుడి మాదిరి తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి మండిపడ్డారు.  ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన కేసీఆర్... త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థం అవుతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్... కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దాన్ని అవహేళన చేశారన్నారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కేసీఆర్ శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే... దానిని కూడా సీఎం అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మేలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదని విజయశాంతి అన్నారు.

మంచిమాట
నేటి మంచి మాట .....
Friday June 08, 2018

*సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు. *  తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.