పతనమవుతున్న బెల్లం ధరలు
Published: Wednesday December 12, 2018

అనకాపల్లి: ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో బెల్లం ధరలు రోజు రోజుకి పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీన ఒకటోరకం వంద కిలోలు రూ.3110 పలకగా మధ్యరకం రూ. 2770లకు పలికింది. నల్లబెల్లం రూ.2520లకు పలికాయి. 10న ఒకటోరకం రూ.3060, మధ్యరకం రూ.2740, నల్లబెల్లం రూ. 2490లకు పడిపోయింది. మంగళవారం ఒకటో రకం రూ.3000లకు పడిపోగా మధ్యరకం రూ. 2710కి తగ్గిపోయింది. నల్లబెల్లం రూ.2530కి పెరిగింది. వాస్తవానికి ఒకటో రకం బెల్లం దిమ్మలు తక్కువగా వస్తుంటాయి. దాని తరువాత రకాన్నే ప్రమాణికంగా తీసుకోవాలి. ఆతరువాత రకమైతే రూ.2860లకు పలికినట్టు వర్తకులు చెబుతున్నారు. ఇతర మార్కెట్ల్లో ధరలు తక్కువగా ఉండడంతో వాటి ప్రభావం అనకాపల్లి మార్కెట్పై కూడా పడుతుందని వర్తకులు చెప్పారు.
అలాగే మహారాష్ట్ర, కర్ణాటక బెల్లాలు ఇతర రాష్ట్ర వర్తకులకు రవాణాతో సహా కలుపుకొని తక్కువ రేటుకు అమ్మకాలు చేయడంతో అనకాపల్లి మార్కెట్కు ఆర్డర్లు తగ్గుతున్నాయని వర్తకులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో బెల్లం ధరలు పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా చెరకు పంటకు తెగుళ్లు సోకి ఆర్థికంగా నష్టపోతున్న సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగల పర్వదినం సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకకు అనకాపల్లి బెల్లా న్ని కొనుగోలు చేసి ఉంటే రైతులకు కొంతైనా గిట్టుబాటు ధర లభించేదని చెరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు తెలిపారు.

Share this on your social network: