.వాళ్లు మనుష్యులా పశువులా..?

Published: Friday December 07, 2018
 నంద్యాల పట్టణం మెయిన్‌ బజార్‌లో ఉన్న జమాల్‌ బాషా దర్గా ఉరుసు వైభవంగా జరుగుతోంది. అక్కడ తాగి గొడవ పడుతున్న వాళ్లను ఓ యువకుడు వారించాడు. దీంతో వారు రెచ్చిపోయారు. కత్తితో ఆ యువకుడి గుండెల్లో పొడిచారు. అక్కడికక్కడే అతను కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది. నంద్యాల పట్టణం మెయిన్‌ బజార్‌లోని జమాల్‌బాష దర్గా ఉరుసుకు ప్రాధాన్యం ఉంది. ఈనెల 4వ తేదీ నుంచి మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ ఉరుసును చూసేందుకు స్థానిక సలీంనగర్‌ వీధికి చెందిన మదార్‌వలి కొడుకు షేక్‌ అబ్దుల్‌ హమీద్‌(28) వచ్చాడు. ఇతను లారీ బాడీ బిల్డింగ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగించేవాడు.  దర్గా వద్ద వేడుకలు చూస్తుండగా సమీపంలోనే మద్యం మత్తులో కొంత మంది యువకులు గొడవపడుతున్నారు. హమీద్‌ వారి వద్దకు వెళ్ళి గొడవపడటం ఎందుకని వారించాడు. దీంతో మాటా మాటా పెరిగింది. మద్యం మత్తులో ఉన్న వారు తమ వద్ద ఉన్న కత్తితో అబ్దుల్‌ హమీద్‌ ఛాతీపై పొడిచారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఉరుసులో ఉన్న ప్రజలు ఈ ఘటనకు భయబ్రాంతులయ్యారు. కొంత మంది గాయపడిన హమీద్‌ను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండెకు బలమైన గాయం కావడంతో అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కూతవేటు దూరంలోనే హత్య జరగడం కలకలం రేపింది. ఉరుసులో పోలీసులు భద్రత చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఈ హత్య ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు పాల్గొనగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వన్‌టౌన్‌ సీఐ రియాజ్‌అహ్మద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.