పనిమనిషి పేరిట 20,000 గజాలు
Published: Friday March 15, 2019

చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక నిందితుడు రాకేశ్రెడ్డి సెటిల్మెంట్లు, బెదిరింపులు ఒకటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రగతి రిసార్ట్స్ ఎండీ కుటుంబాన్ని బెదిరించి.. 20వేల గజాల స్థలాన్ని తన పనిమనిషి పేరుతో.. గచ్చిబౌలిలో ఖరీదైన 3.16 ఎకరాల భూమిని మరో బినామీ పేరుతో రిజిస్టర్ చేయించాడు. మరోవైపు.. ఈ హత్యకేసుతో సంబంధమున్న సినీనటుడు సూర్యప్రకాశ్, అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్, సిరిసిల్లకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
జయరాం బలహీనతను అవకాశంగా తీసుకుని, అతడిపై వలపువల విసిరి రాకేశ్రెడ్డి తన ఇంటికి రప్పించుకున్నాడు. ఆ తర్వాత దారుణంగా హతమార్చాడు. దర్యాప్తులో.. ఫేస్బుక్లో ‘వీణ’ అనే పేరుతో నకిలీ ఐడీని, వాట్సాప్ ఖాతాను తెరిచింది సినీనటుడు సూర్యప్రకాశ్, అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్ అని గుర్తించారు. వీరిద్దరికీ ఆరు నెలల క్రితం రాకేశ్రెడ్డి పరిచయం అయ్యాడు. రాకేశ్రెడ్డి జనవరి 29న వీరిద్దరితో కలిసి జయరాం ఇంటికి వెళ్లాడు. జయరాం ఉన్నాడా? లేదా? అని వాకబు చేసివచ్చింది సూర్య అని డీసీపీ చెప్పారు. ఆ రోజు జయరాం లేకపోవడంతో.. మర్నాడు ‘వీణ’ పేరుతో ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాలను తెరిచారు. వలపువలను విసిరారు. జనవరి 31న వీణ వద్దకు తీసుకెళ్తానంటూ జయరాంను జూబ్లీహిల్స్ క్లబ్కు పిలిపించారు. ఆ తర్వాత జయరాంను కారులో రాకేశ్రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. వీరిద్దరిపై ఐపీసీలోని 349, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు.

Share this on your social network: