స్వచ్ఛంద సంస్థ ముసుగులో ప్రముకులపై యువతుల వల
Published: Saturday September 21, 2019

స్వచ్ఛంద సంస్థ ముసుగులో 18 మంది యువతులు మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాలయం కేంద్రంగా వీవీఐపీలను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశారని తేలింది. ఇండోర్ నగరంలో ఓ మున్సిపల్ ఇంజినీరు ఇచ్చిన ఫిర్యాదు మేర ముగ్గురు అమ్మాయిలను అరెస్టు చేసిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లు వీరి ట్రాప్లో పలువురు ప్రముఖులున్నారని వెల్లడి కావడంతో సంచలనం రేపింది. యువతులు వీవీఐపీలతో స్నేహం చేసి, వారిని హోటళ్లు, అతిధి గృహాలకు పిలిచి వారితో గడిపి, దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజినట్లు క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, సీనియర్ ఐఎఎస్ అధికారులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ అమ్మాయిల బారిన పడి డబ్బులు సమర్పించుకున్నట్లు క్రైబ్రాంచ్ పోలీసులు చెప్పారు. ఈ హనీట్రాప్ బాగోతంలో ఐదుగురు యువతులను అరెస్టు చేసి వారి నుంచి రూ.14 లక్షల నగదు, ఓ కారు, ల్యాప్టాప్, 8 సిమ్ కార్డులు, 15 మంది పడకగది దృశ్యాల వీడియోలు, హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అమ్మాయిల వద్ద 150 ప్రముఖుల ఫోన్ నంబర్లు లభించాయి. నేతలు, అధికారులు, వీవీఐపీల వద్దకు అమ్మాయిలను పంపించి, పడకగది దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ బాగోతంలో కొందరు పోలీసు అధికారులు, జర్నలిస్టులు కూడా మధ్యవర్తులుగా మారి అమ్మాయిలకు సహకరించారని తేల్చారు. హనీట్రాప్ బారిన పడిన ఓ ఎంపీ డబ్బు కోసం వారు పెట్టిన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం కూడా చేశారు. మధ్యప్రదేశ్ సచివాలయం కేంద్రంగా అమ్మాయిలు హనీట్రాప్ బాగోతం సాగించారని, పలువురు వీవీఐపీల వద్ద వీరు నిత్య సందర్శకులని పోలీసులు గుర్తించారు.హనీట్రాప్ రాకెట్ వ్యవస్థాపకురాలు ఆర్తి దయాళ్ 8 నెలల క్రితం తన భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఛారత్ పూర్ నుంచి భోపాల్ నగరానికి వచ్చి ఓ ఐఎఎస్ అధికారి అండదండలతో భోపాల్ నగరంలో ఓ భవనం అద్దెకు తీసుకొని స్వచ్ఛంద సంస్థ పేరిట హనీట్రాప్ బాగోతానికి తెర లేపారని పోలీసుల దర్యాప్తులో రుజువైంది. నిత్యం భోపాల్ సచివాలయానికి వెళుతూ అక్కడి వీవీఐపీలను లక్ష్యంగా చేసుకొని ఈ దందా సాగించి కోట్లాదిరూపాయలు వసూలు చేశారని సమాచారం. ఈ రాకెట్ లో శ్వేతా విజయజైన్ అనే మరో యువతి బీజేపీ మాజీ సభ్యురాలని, ఈమెకు మాజీ ముఖ్యమంత్రి సిఫారసుతో మినాల్ రెసిడెన్సీలో ఓ బంగళా తీసుకున్నారు. బుందేల్ ఖండ్, మల్వా, నిమార్ ప్రాంతాల మంత్రులతో శ్వేతాకు సంబంధాలున్నాయని తేలింది. శ్వేతా బంగ్లాలో సాక్షాత్తూ కలెక్టరు ఉండటంతో అతని భార్య ఈమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నేతలు, అధికారులే కాకుండా పారిశ్రామికవేత్తలతో ఈమెకు సంబంధాలున్నాయని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మరో యువతి స్వప్నిల్ జైన్ తాను ఫిజియోథెరపిస్టునని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ బంగ్లాలోనే నివాసముంటూ పలువురు ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వారినుంచి రూ.2కోట్లు గుంజారని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యురాలైన బర్కా భట్నాగర్ సోని అనే మహిళ ఇద్దరు మంత్రులకు సన్నిహితంగా ఉంటూ కార్యకలాపాలు సాగించిందని తేల్చారు.

Share this on your social network: