టాయిలెట్లో సీసీటీవీ కెమెరాలు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. మహిళా ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ఓ వెబ్ డిజైనింగ్ సంస్థ యజమాని వారి రెస్ట్ రూములో సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. పల్లివలికి చెందిన ఎస్ సంజు ‘జడ్త్రీ ఇన్ఫోటెక్’ పేరుతో నాలుగేళ్లుగా ఓ వెబ్ డిజైనింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. దాదాపు నెలన్నర క్రితం నాగర్కోయిల్ ప్రాంతానికి తన కార్యాలయాన్ని తరలించాడు. అక్కడతడు ముగ్గురు మహిళా ఉద్యోగులను నియమించుకున్నాడు.
ఈ ఆఫీసులో మహిళలకు ఒకటి, పురుషులకు ఒకటి రెండు రెస్ట్ రూములు ఉన్నాయి. శుక్రవారం ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్లోకి వెళ్లగా అక్కడ రహస్యంగా ఏదో జరుగుతున్నట్టు అనుమానించింది. పరీక్షించి చూడగా టాయిలెట్ లోపల ఓ బ్లాక్ కవర్ కనిపించింది. దానిని తెరచి చూసి నిశ్చేష్టురాలైంది. అందులో సీసీటీవీ కెమెరా ఉంది. సాయంత్రం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి యజమానిపై ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను కూడా సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అందులో అభ్యంతరకర విషయాలు ఏవీ లేవని, సీజ్ చేసిన వస్తువులను విశ్లేషణ కోసం సైబర్ క్రైం పోలీసులకు పంపినట్టు చెప్పారు.

Share this on your social network: