విత్తన కంపెనీలపై కేసులు
Published: Tuesday July 31, 2018

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం విత్తన ఉత్పత్తి కంపెనీలపై దాడులు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్న కంపెనీలపై 47 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ప్యాకెట్లలో తక్కువ తూకంతో విత్తనాలు నింపుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అలాగే విత్తనాల సంచి ధర ఎంత అనేది ప్యాకెట్పై ముద్రించకుండా తయారుచేస్తున్న విషయం వారి దృష్టికి వచ్చింది. ఒక ప్యాకెట్ను ఎంతకు అమ్మాలనే ధర నిర్ణయించకుండా, డిమాండ్ను బట్టి సందర్భానుసారం ధరలు పెంచి అమ్ముకునేందుకు వీలు కలిగిస్తున్నారని అధికారులు అంచనాకు వచ్చారు.
నంద్యాలలో బాలసాయి, నందికొట్కూరులో తిరుమల ట్రేడర్స్, కడపలో తిరుమల ఆగ్రో సెంటర్, పశ్చిమగోదావరిలో డెల్టా సీడ్స్ కార్పొరేషన్, తూర్పుగోదావరిలో వివేకానంద సీడ్స్, నెల్లూరులో వర్షిత సీడ్స్, గుంటూరులో శ్రీకీర్తి కాటన్ సీడ్స్, శ్రీనివాస సీడ్స్, తణుకులో దుర్గా వరలక్ష్మి ఏజెన్సీస్ తదితర కంపెనీలపై కేసులు పెట్టినట్టు అధికారులు తెలిపారు. విత్తనాలపై ఏవైనా ఫిర్యాదులుంటే రైతులు 1100కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

Share this on your social network: