పెద్దలు పెళ్లికి అంగీకరించరని నిరాశతో .. గూడ్స్ రైలుకింద పడిన వైనం
Published: Saturday August 04, 2018

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోరనే నిరాశతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బేతంచెర్ల -బుగ్గానిపల్లె రైల్వేస్టేషన్ వద్ద నంద్యాల వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు కింద పడి బేతంచెర్ల పట్టణానికి చెందిన సురేంద్ర (22), హారిక (17) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్కు చెందిన లక్ష్మీదేవి, హుస్సేనయ్య దంపతుల కుమారుడు సురేంద్ర పదో తరగతి పూర్తి చేసి పట్టణంలోని పాత బస్టాండులో ఉన్న సుధాకర్ సెల్ పాయింట్లో గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు.
పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మీరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె హారిక కొత్త బస్టాండు సమీపంలోని జూనియర్ కళాశాలలో వారం రోజుల క్రితం చేరింది. వీరివురూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆటోలో బేతంచెర్ల రైల్వేస్టేషన్కు వచ్చి అక్కడ్నుంచి బుగ్గానిపల్లె వైపు ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తూ బేతంచెర్ల నుంచి 1 కిలోమీటర్ దూరంలోని మైలురాయి 295/3 వద్ద గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడడంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. తల, మొండెం వేరైపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వెళ్లారు. తల, మొండెం వేరుగా పడి పోయిన మృతదేహాలను చూచి బోరున రోదించారు. నంద్యాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నంద్యాల రైల్వే ఆస్పత్రికి తరలించారు.

Share this on your social network: