కాలేజీలో లైంగిక వేధింపులపై తన విభాగం అధిపతితో పోరు
Published: Wednesday August 08, 2018

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర మెడికల్ కళాశాల (ఎస్వీఎంసీ) పీడియాట్రిక్స్ పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. ఎస్వీఎంసీ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, మరో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ లైంగికంగా వేధించారంటూ గతంలో కలెక్టర్ నుంచి గవర్నర్ వరకు శిల్ప ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్ ఆదేశాల మేరకు కళాశాలలోనే ఓమారు అంతర్గత విచారణ జరిపారు. ఆ విచారణలో శిల్పకు మతిస్థిమితం సరిగ్గా లేదని నివేదిక అందజేయగా, దానిపై ఆమె మరోసారి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీవో, చిత్తూరు మహిళా డీఎస్పీ, ‘తుడా’ కార్యదర్శి, ఐసీడీఎస్ అధికారులు, డీఎంహెచ్వోలతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ శిల్ప ఆరోపణలపై మరోమారు విచారణ జరిపింది.
విచారణల సందర్భంగా శిల్పకు అధ్యాపకుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, ఫైనల్ పరీక్షల్లో వారు తనను ఎక్కడ ఫెయిల్ చేస్తారోనని ఎప్పుడూ భయపడుతుండేదని శిల్ప భర్త, ఆర్థోపెడిక్ సర్జన్ రూపేశ్ కుమార్ రెడ్డి వాపోయారు. దీనివల్ల తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన ఆమెకు మానసిక శాస్త్ర నిపుణుల వద్ద కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆయన తెలిపారు. అయితే, ఆమె భయపడినట్టే థియరీ విభాగంలో ఫెయిల్ అయ్యిందని తెలిపారు. అధ్యాపకులపై అనుమానంతో ఆ పేపర్లను రీ-వెరిఫికేషన్కు పంపామని, అందులో కూడా ఆమె ఫెయిల్ అయినట్లు తమకు సోమవారం సాయంత్రం తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో తాను ఆస్పత్రి నుంచి అర్థరాత్రి ఇంటికెళ్లి చూసేలోపు శిల్ప ఉరివేసుకుని చనిపోయినట్టు చెప్పారు. కాగా, రూపేశ్, శిల్ప బంధువు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రిన్సిపాల్ ఆఫీసు ముట్టడి..రవిపై వేటు
శిల్ప ఆత్మహత్యకు నిరసనగా ఎస్వీఎంసీలో మెడికోలు ఆందోళన చేశారు. ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేదిలేదంటూ నినదించారు. ఐదు రోజుల పాటు తరగతులను బహిష్కరిస్తున్నట్టు హెచ్చరించారు. శిల్ప ఆత్మహత్య, దానిపై విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించింది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయి విచారణకు హైపవర్ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ డీఎంఈ బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం ఎస్వీఎంఎసీకి రానుంది. కాగా, శిల్ప కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ ప్రకటించారు. దీనిపై ఆయన మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Share this on your social network: