అసలు పని వదిలి ఐపీఎస్ల అడ్డగోలు దందాలు
Published: Monday August 13, 2018

ఒక సీనియర్ ఐపీఎస్ ని బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా తాజాగా పక్కన కూర్చోబెట్టింది. ‘ఎందుకిలా జరిగిందా?’ అని ఐపీఎస్ వర్గాల్లో చర్చ మొదలుకావడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సంస్థకు రూ.10 కోట్లు బిల్లులు విడుదల చేసేందుకు రూ.కోటి కమీషన్ అడిగారని, అందుకే బదిలీ వేటు పడిందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలో కీలక స్థానంలో ఉంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని సర్వీసెస్ అందించే సంస్థ ప్రతినిధులు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతోనే ఆ సీనియర్ ఐపీఎ్సపై వేటు పడినట్లు సమాచారం.
నెలవారీ మామూళ్లు పెంచి తమను ఇబ్బంది పెడుతున్నారని వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపిన ఏసీబీ అందులో వాస్తవమున్నట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ అధికారికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయన్న సమాచారాన్ని సేకరించింది. కేసు నమోదుకు ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిసింది. అయితే విషయం పసిగట్టిన ఈ అవినీతి సింహం ప్రభుత్వంలోని పెద్దల వద్దకెళ్లి కాళ్లావేళ్లా పడినట్లు కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. ఉత్తరాంధ్రలోని హోటల్ తన కుమార్తెదని, ఆస్తులు బంధువులవని చెప్పుకొన్నట్లు సమాచారం. ప్రస్తుతం పనిలేకుండా కూర్చున్న ఆయన తనకు ఏ పాపం తెలియదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
అండాదండా పుష్కలం
తీవ్ర విమర్శలకు తావిస్తోన్న మరో అధికారి వ్యవహారం ఒక అనకొండనే తలపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఎస్పీగా పనిచేసిన ఆయన సర్వీసుకు మించి ఆస్తులను పోగేసినట్లు ఐపీఎస్ అధికారులే చెబుతున్నారు. సర్వీస్ రివాల్వర్ టేబుల్పై పెట్టి మైనింగ్(బ్లాక్లైట్) చెప్పిన రేటుకు తనకే విక్రయించాలని హెచ్చరించి కొనుగోలు చేశారని.. భార్య పేరుతో ఎగుమతి కంపెనీ ప్రారంభించి రూ.కోట్లలో వ్యాపారాలు చేశారని పేర్కొంటారు. బాధితులు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఆయన సమీప బంధువు అధికార పార్టీలో కీలకస్థానంలో ఉండటంతో చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులే బాధితుల జాబితాలో ఉన్నారంటే ఆయనస్థాయి ఏ పాటిదో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన యూనీఫామ్ డ్యూటీకి దూరంగా ఉన్నా.. ప్రతి చిన్న దాంట్లోనూ కమీషన్ ఇవ్వందే పని జరగనీయడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓడలకు మంచినీరు సరఫరా చేసే బోటు యజమానుల నుంచి లక్షలు పిండేశారని అంటారు. దీనిపై ఫిర్యాదు అందినా.. విచారణలో కొంతమేర వాస్తవముందని తేలినా.. ఆయన్ను కదిపే సాహసం చేయడం లేదు.
సబ్బులు, షాంపూలు ఫ్రీ!
మూడో ఐపీఎస్కు.. నెల మామూళ్లు ఆలస్యమైతే ఉపేక్షించబోరన్న పేరుంది. ఆయన భార్య బంగారు, వస్త్ర దుకాణాలు, ఆఖరికి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో సబ్బులు, షాంపూలు సైతం కొనుగోలు చేసి డబ్బివ్వకుండా వెళ్లిపోతారన్న అపవాదు ఉంది. కొన్ని నెలల క్రితం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. కాగా, ఒక క్లబ్బులో పేకాటకు అనుమతిచ్చి లక్షల్లో నెల మామూళ్లు తీసుకొంటున్నారన్న ఆరోపణల్లోనూ వాస్తవముందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. గతంలో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె ఫిర్యాదు చేయడంతో డబ్బులిచ్చి రాజీ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి సాయంత్రం..
నాలుగు సింహాల్లో చివరి యువ సింహం లీలలు ఐపీఎస్ వర్గాల్లో కథలుకథలుగా చెప్పుకొంటున్నారు. ఎస్పీగా పనిచేసిన మొదటి జిల్లాలోనే క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల దగ్గర అత్యంత ఖరీదైన కారు తీసుకుని తన తండ్రికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారని అప్పట్లో తీవ్ర వివాదం చెలరేగింది. ఓ మహిళా వైద్యురాలితో చనువుగా ఉంటున్నారన్న ఆరోపణలతో బదిలీ చేసినా తర్వాత మరో జిల్లాలో ఏకంగా కార్యాలయంలోనే రాసలీలలకు తెరతీసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ‘నచ్చిన అమ్మాయిలు వరకట్న బాధితురాళ్లుగా బ్రోకర్లతో కలిసి సాయంత్రం వచ్చేస్తారు. వారితో ఆఫీసులోనే ఎక్కువసేపు గడిపేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. కొన్నాళ్లకు అనుమానం రావడంతో ఉన్నతాధికారులు ఆరా తీశారు’ అని అంటారు. దీనిపై పోలీస్ బాస్ హెచ్చరించినట్లు సమాచారం. ప్రతి చిన్న కార్యక్రమానికీ ఫ్లెక్సీలను పెట్టించి జిల్లా అంతా సినిమా స్టార్లా ఫోజులతో కనిపించడం అంటే ఎంతో ఆసక్తి.

Share this on your social network: