చెల్లిని దారుణంగా నరికేసిన అన్న
Published: Wednesday October 03, 2018

ఆస్తి తగాదాలు ఆడ కూతురి ప్రాణాలు బలితీసుకున్నాయి. పొలం తనకు అమ్మలేదన్న ఆక్రోశంతో అన్నయ్యే (బాబాయి కొడుకు) చెల్లిని నడిరోడ్డుపై నరికేశాడు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృష్ణమూర్తి, రాజారావు అన్నదమ్ములు. పెద్దవాడైన రాధాకృష్ణకు నలుగురు కుమార్తెలు. రాజారావుకు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణకు చెందిన ఎకరం పొలం విషయంలో రాజారావు కుమారుడు సింగయ్యతో వివాదం నడుస్తోం ది. పొలం తనకే అమ్మాలని సింగయ్య(40) పట్టుబట్టగా రాధాకృష్ణ ససేమిరా అన్నాడు. దీంతో కక్ష పెంచుకున్న సింగయ్య ఆ పొలాన్ని ఎవరూ కొనకుండా చానాళ్లు అడ్డుపడ్డాడు. ఇదేకాక గతంలో ఇంటిదగ్గర మురు గునీరు విషయంలోనూ రాధాకృష్ణ నాలుగో కుమార్తె పద్మావతి (28), సింగ య్య మధ్య తీవ్ర గొడవ జరిగింది. అయితే ఇటీవల తన పొలాన్ని ఎలా గోలా అమ్ముకున్న రాధాకృష్ణ ఆ సొమ్ముతో ఆరు నెలల క్రితం కుమార్తె పద్మావతిని పెళ్లి చేశారు. ఆమె భర్తతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది.
అవార్డు తీసుకునేందుకు వచ్చి..
పద్మావతి సోషల్ వర్క్లో పీజీ చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ప్రభుత్వ అధికారుల ప్రశంసలు పొందింది. మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులో అవార్డు స్వీకరించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమె మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒంగోలు వెళ్లేందుకు స్వర్ణలో బస్షెల్టర్ వద్దకు వస్తుండగా అక్కడే మాటు వేసిన సింగయ్య ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. చాతీకింద, మెడపైన సుమారు 10 చోట్ల ఆమెను కిరాతకంగా నరికాడు. దీంతో పద్మావతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పారిపోయేందుకు యత్నించిన సింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this on your social network: