మే రెండో వారంలో టెన్త్ ఫలితాలు

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ 10వ తరగతి జవాబు పత్రాలు వేగవంతంగా మూల్యాంకనం చేస్తున్నామని, మే రెండవ వారంలో టెన్త్ పరీక్షా ఫలితాలు ఎట్టి పరిస్థ్థితుల్లో ప్రకటిస్తామని విద్యాశాఖ కమిషనర్ కె. సంధ్యారాణి వెల్లడించారు. మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకన శిబిరాన్ని గురువారం సంధ్యారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ సబ్టెక్టుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తున్న అసిస్టెంట్ ఎగ్జామినర్లతో చర్చించారు. శిబిరంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. స్టాక్ రిజిస్ట్రర్లను పరిశీలించారు. ఓఎంఆర్ సీట్లను కూడా పరిశీలించారు. డీఈవో ఎంవి రాజ్యలక్ష్మి, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ లింగేశ్వరరావు, గుడివాడ డీవైఈవో కమలకుమారిలతో టెన్త్క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహణపై సమీక్షించారు. డీఈవో రాజ్యలక్ష్మి సంధ్యారాణికి వాల్యుయేషన్ వివరాలను వెల్లడించారు. 15 నుంచి 27 వరకు వాల్యూయేషన్ నిర్వహిస్తామన్నారు. 5,23,961 జవాబు పత్రాలు అందాయని, వీటిల్లో ఇప్పటి వరకు 1,45,708 పత్రాలను మూల్యాంకనం చేశామన్నారు. అనంతరం సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. తాను జారీ చేసిన ఉత్తర్వులు, నిబంధనలకనుగుణంగా డీఈవో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని శిబిర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Share this on your social network: