జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ద్వారాలు
Published: Monday September 16, 2019

రాష్ట్రంలో ప్రైవేటు అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇంటర్ బోర్డు నుంచి నోటిఫికేషన్ లేకున్నప్పటికీ... విచక్షణాధికారంతో సర్కారు ఉదారంగా అనుమతులు ఇచ్చేస్తోంది. ఇంటర్ బోర్డుతో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట నేరుగా విద్యాశాఖమంత్రికి వినతి పత్రం సమర్పించుకుంటే చాలు.. కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసేస్తున్నారు. ఫీజిబిలిటీ లేనప్పటికీ , ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకున్నా నిబంధనలు సడలించి అడిగిందే తడవుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులు, పైరవీలే ప్రాతిపదికగా అనుమతులు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు చివరిసారిగా 2013-14 విద్యా సంవత్సరంలో ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత(గత ఏడేళ్లుగా) ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో కొత్త కాలేజీ ఏర్పాటుకు నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. కానీ పలుకుబడి ఉన్న వారు, ప్రజాప్రతినిధులు మాత్రం.. సర్కారు విచక్షణాధికారంతో కాలేజీలను తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది జూన్లో అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వం గత 100 రోజుల్లో 10 కొత్త ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు(జూన్లో 4, జూలైలో ఒకటి, సెప్టెంబరులో 5) అనుమతి ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో విశాఖపట్నం జిల్లాలో ఐదు, విజయనగరం, కడప, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. మరో 25 కొత్త కాలేజీల కోసం ఎడ్యుకేషన్ సొసైటీలు ఇచ్చిన దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఆ ఫైళ్లూ ఇంటర్బోర్డు నుంచి లాంఛనాలు పూర్తిచేసుకొని తాజాగా సచివాలయానికి చేరుకున్నాయి. వీటికీ దశల వారీగా అనుమతులు లభించబోతున్నాయని సమాచారం.
కొత్త కాలేజీ ఏర్పాటుకు సొసైటీ ద్వారా నేరుగా విద్యామంత్రికి వినితిపత్రం అందజేయగానే.. ఆయన సూచన మేరకు అది పాఠశాల విద్యాశాఖ(ఇంటర్ విద్య) ముఖ్యకార్యదర్శికి వెళుతుంది. అక్కడ లాంఛనం పూర్తి కాగానే ఆ పత్రాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శికి పంపిస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ కాబట్టి తగిన రిపోర్టు పంపాలంటూ ఆయన దాన్ని సదరు జిల్లాకు చెందిన రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్(ఆర్ఐవో)కు పంపుతారు.
ఆర్ఐవో నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆ సొసైటీ వినతి పత్రాన్ని పరిశీలించి ఫీజిబిలిటీ రిపోర్టును తిరిగి ఇంటర్ బోర్డు కార్యదర్శికి పంపించాలి. ఇంటర్ బోర్డు కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వనందున, నిబంధనలు అనుమతించవంటూ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఉన్నత స్థాయి నుంచి సిఫారసుతో వస్తున్నారు కాబట్టి మనకెందుకులే అన్న ధోరణిలో రిపోర్టులు పంపిస్తున్నారు. ఫీజిబిలిటీ ఉంటే కదా అనుమతులు ఇవ్వాలన్న ప్రశ్నకు .. ఆ విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉందంటూ తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీల ప్రతినిధులతో కూడబలుక్కుని మరీ రిపోర్టులు పంపిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

Share this on your social network: