ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థుల్లో పెరుగుతున్న అనాసక్తి
Published: Thursday August 02, 2018

ఇంజనీరింగ్ విద్య పట్ల యువత ఆసక్తి తగ్గిపోతుందా..? ఒకప్పుడు క్రేజీగా ఉన్న బీటెక్ చదువు అన్ని రకాలుగా భారంగా మారడంతో యూత్ డిగ్రీ చదువుల వైపు మరలుతున్నారా...? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సంబంధిత కోర్సులకే డిమాండ్ కనిపిస్తోంది. మిగతా కోర్ బ్రాంచీలుగా ఉన్న కోర్సులకు ఆదరణ కరువైంది. గతంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్కు క్రేజీ ఉండేది. 1990 తర్వాత కంప్యూటర్ విప్లవం రావడంతో ఒక్కసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్ విద్యకు దూర మై, కంప్యూటర్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నారు.
విశ్వ వ్యాప్తంగా కంప్యూటర్ ఇంజనీరింగ్కు డిమాండ్ క్రమంగా పెరిగిపోవడం, ఐదంకెల జీతాలు సమాజంలో ఓ స్టేటస్గా మారడం, అమెరికా పయనం లాంటి వాటితో ఈ కోర్సులకు యువత ఆకర్షితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి రాగానే ఇంజనీరింగ్ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ విధానం అమలు చేయడంతో ఎక్కువ మంది విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సులకు స్వస్తి పలికి ఇంజనీరింగ్ వైపు మరలారు.
ఈ క్రమంలో ఇంజనీరింగ్ చేసిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం... ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో ఇంజనీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా మారిపోయారు. చిన్నా చితక పోస్టులకు సైతం ఇంజనీరింగ్ పట్టభద్రులు దరఖాస్తులు చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే.. గత నాలుగేళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు నిండడం లేదు. చాలా బ్రాంచీల్లో విద్యార్థులు చేరకపోవడంతో ఖాళీగా ఉండడం, వాటిని భరించే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలు కోళ్ల ఫారాలుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని కాలేజీలు డిమాండ్ ఉన్న విభాగాలను మాత్రమే కొనసాగిస్తూ మిగిలిన భవనాలను ఇతర సంస్థలకు అద్దెకిస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఘోరం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఇంజనీరింగ్ విద్యకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉండడం తో ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్పై ఆంక్షలు విధించడంతో అనేక కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ మండలం మచ్చాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ మూతపడింది. ఆ కాలేజీ భవనాల్లో ప్రస్తుతం ఎన్టీయార్ ట్రస్టు ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటైంది. దీంతో పాటు అర్బన్ జిల్లాలోని పంథిని ప్రాంతంలో ఓ కాలేజీ పరిస్థితి కూడా అంతే. రంగశాయిపేట ప్రాంతంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ సంస్థను కొనసాగించలేక, ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ చేసి సగం భాగాన్ని అమ్మింది. మిగిలిన భాగంలో ఓ కార్పొరేట్ పాఠశాలకు అప్పగించింది. రూరల్ జిల్లాలోని ఆత్మకూర్ మండలం గూడెప్పాడ్ దగ్గరున్న రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి మూతపడగా, మరో దాంట్లో ప్రభుత్వ బీసీ వసతిగృహం నడుస్తోంది.
ఖాళీగా కాలేజీలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రైవేట్ యాజమాన్యం కింద ప్రస్తుతం 15 ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. కన్వీనర్ కోటా కింద 5040 సీట్లు ఉండగా, ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్ ద్వారా మూడు దశల్లో 3164 సీట్లను భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం ఒక్క కాలేజీలో మాత్రమే 630 కన్వీనర్ కోటా సీట్లుంటే అన్నీ భర్తీ అయ్యా యి. అర్బన్ జిల్లా సరిహద్దులో ఉన్న మరో కాలేజీలో 504 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటే 28 సీట్లు మెకానికల్ బ్రాంచిలో ఖాళీగా ఉన్నాయి. ఇక మహిళా కాలేజీలో సైతం సీట్లు ఖాళీగా ఉండడం విస్తుపోయేలా చేస్తోంది. ప్రైవేట్ మహిళా కాలేజీలో 210సీట్లు మూడు బ్రాంచీల్లో ఉంటే ఈఈఈ బ్రాంచిలో 26, ఈసీఈలో 2 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.

Share this on your social network: