‘నన్నయ’ స్నాతకోత్సవ సభలో గంటా
Published: Thursday November 29, 2018

విద్యావ్యవస్థే సమాజాన్ని మార్చగలదని, ఈ విశ్వాసంతోనే నాలుగున్నర సంవత్సరాలుగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్చెరువులో ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గంటా మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. విద్య ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తోందన్నారు. ఉపకులపతి ముత్యాలనాయుడు మూడు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని వివరించారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ చైర్మన్ అల్లం అప్పారావుకు విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. రెక్టార్ సురేష్ వర్మ, రిజిస్ట్రార్ టేకి, ప్రిన్సిపల్ హైమావతికి ఉత్తమ పరిశోధనా అవార్డులు అందజేశారు. 18మదికి పీహెచ్డీ పట్టాలు, ఇంజనీరింగ్లో 24, ఆర్ట్స్ అండ్ కామర్స్లో 162, సైన్స్ అండ్ టెక్నాలజీలో 125 మందికి పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభావంతులు 14మందికి బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వేదికపై ప్రిన్సిపాళ్లు, డీన్స్, ఈసీ సభ్యులు, అకడమిక్ సెనేట్ సభ్యులు ఆశీనులు కాగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ మాగంటి మురళీమోహన్, ప్రేక్షకుల మధ్య కూర్చుని కార్యక్రమాన్ని తిలకించారు.

Share this on your social network: