జగన్ కి షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

Published: Sunday March 24, 2019
వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి షాక్‌ ఇచ్చారు. టీడీపీ టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీలో చేరేందుకు వెళ్లి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టికెట్‌ను చంద్రబాబు వేరే వ్యక్తికి కేటాయించడంతో పులపర్తి టీడీపీకి రాజీనామా చేశారు. శనివారం వైసీపీలో చేరాలని నిర్ణయించుకుని పిఠాపురంలో జరిగిన జగన్‌ బహిరంగ సభకు హాజరయ్యారు. జగన్‌ ప్రసంగం ముగిశాక బస్సెక్కి ఆయనతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం జగన్‌ కండువా వేసేందుకు ప్రయత్నించగా పులపర్తి తిరస్కరించారు. ఒప్పించేందుకు ప్రయత్నించినా అంగీకరించలేదు. జగన్‌ అవాక్కయ్యారు. తన చేతిలోనున్న కండువాను పక్కనున్న నేత చేతిలో పెట్టి పులపర్తిని పంపేయాలని సైగలు చేశారు.
 
ప్రజలకు అభివాదం చేసి పులపర్తి బస్సు దిగిపోయారు. తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరలేదని, అక్కడ ప్రవర్తన, నియమాలు చూసి చేరకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయం పెద్దదేం కాదని చెప్పి వెళ్లిపోయారు. పులపర్తి తనకు ఎమ్మెల్సీ కావాలని అడిగారని.. ముందు మీరు పార్టీలో చేరండి... అన్ని విషయాలూ చర్చిద్దామని జగన్‌ ఆయనతో అన్నారని తెలిసింది. ఇదే సమయంలో జగన్‌ బలవంతంగా కండువా వేయడానికి ప్రయత్నించగా పులపర్తి ప్రతిఘటించారు