పదవులపై నాకు ఆశలేదు: రోజా

Published: Wednesday June 12, 2019
ముఖ్యమంత్రి పదవిలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉండాలని కోరుకున్నామని.. అది నెరవేరిందని నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ సీఎం అయితే తామంతా అయినట్లేనని స్పష్టం చేశారు. పదవులపై తనకు ఆశలేదని.. మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తితో ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారమిక్కడ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె జగన్‌తో సమావేశమయ్యారు.
 
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక.. తానింతవరకు కలువలేదని.. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన్ను ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. తొమ్మిదేళ్లు కష్టపడి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చామని.. సీఎం పదవిలో జగన్‌ ఉండాలనే కోరుకున్నామని.. తమకు పదవులేమీ వద్దని రోజా పేర్కొన్నారు. కాగా.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి కూడా జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న అసంతృప్తి లేదని.. ఇదంతా ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.