చివరి చూపుకి సన్నగిల్లిన ఆశ

Published: Saturday September 21, 2019
దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద బోటు ప్రమాద విషాదం నుంచి జనం ఇప్పటికీ తేరుకోలేదు. బాధిత కుటుంబాలైతే ఇంకా ఆ ఘోరాన్ని తలచుకుని విలపిస్తూనే ఉన్నాయి. భీతావహ స్థితిలో దొరికిన తమ ఆప్తుల మృతదేహాలను చూసి బాధితులంతా శోకసంద్రం అయ్యారు. ఇక ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి సంగతైతే చెప్పడానికి మాటలు కూడా ఉండవు. కొందరు ప్రమాద ప్రాంతంలోను, మరికొందరు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోను తమ వారి జాడ కోసం వేయి కళ్లతో రోజుల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆరు రోజులు గడిచిపోయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో చివరి చూపైనా దక్కుతుందనే ఆశ సన్నగిల్లిపోతోంది. అయినా ఆశ చావక ప్రభుత్వాసుపత్రి వద్దే తచ్చాడుతున్నారు.
 
మరోవైపు ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 34 మృత దేహాలను గుర్తించగా, శుక్రవారం మరొక గుర్తు తెలియని మహిళ మృతదేహం గోదావరిలో తేలింది. ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తీసుకువచ్చారు. చెవి దిద్దులు, కాళ్ల పట్టీల ఆధారంగా ఆ మృత దేహం విశాఖపట్టణం మహరాణి పేటకు చెందిన మధుపాక అరుణకుమారి (30)గా ఆమె బంధువులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు గల్లంతైన వారిలో 35 మందిని పోలీసులు గుర్తించారు. గురువారం కూడా మరో రెండు మృతదేహాలను గుర్తించినా వాటిని ఈ ఘటనతో సంబంధం లేనివిగా తేల్చారు.
 
నిన్న, మొన్నటి వరకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకున్న బంధువులు తమ వారికి సంబంధించిన మృతదేహాలు దొరకడంతో వాటిని తీసుకుని వెళ్లిపోగా, ఇంకా ఆచూకీ దొరకని వారి కోసం వచ్చిన బంధువులంతా అధికారుల సూచన మేరకు ఇద్దరేసి చొప్పున ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంచి మిగిలిన వారు వెళ్లిపోయారు. బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన జనరల్‌ స్టోర్స్‌ నిర్వాహకుడు పవన్‌ కుమార్‌, అతని భార్య వసుంధర భవాని, విశాఖపట్టణానికి చెందిన నలుగురు, మంచిర్యాలకు చెందిన ట్రాన్స్‌కో ఇంజనీర్‌ రమ్యశ్రీ, పట్టిసీమకు చెందిన బోటు హెల్పర్‌ కర్రి మణికంఠ, నరసాపురానికి చెందిన చట్లపల్లి గంగాధర్‌, వరంగల్‌ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన బస్కీ ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరి రాజ్‌కుమార్‌, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆరు ఏళ్ల విఖ్యాతరెడ్డి తదితరుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.