కార్యకర్తల తీరుపై పవన్‌ అసహనం

Published: Monday December 09, 2019

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి జనసైనికుల్లో క్రమశిక్షణ లేకపోవడమే కారణమని పవన్‌కల్యాణ్‌ అన్నారు. క్రమశిక్షణతో ఎన్నికల్లో పనిచేసి ఉంటే పార్టీ గెలిచేదని కేడర్‌ను ఉద్దేశించి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలపై మండపేటలో పవన్‌ ప్రసంగిస్తుండగా కార్యకర్తలు అరుపులు, కేకలతో అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పవన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘అన్నంపెట్టే రైతు కష్టాలు చెబుతున్నప్పుడు మీరు అరుస్తుంటే నాకు ఎలా వినిపిస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉంది. క్రమశిక్షణ లేకపోతే మీరేమీ చేయలేరు. మీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది మర్చిపోకండి. క్రమశిక్షణతో వ్యవహరించి ఉంటే జనసేన గెలిచి ఉండేది’ అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.