ఎవరూ పౌరసత్వ హక్కును కోల్పోరు

Published: Sunday January 12, 2020
పౌరసత్వ సవరణ బిల్లుపై (సీఏఏ) ఏర్పడిన భయాలను ప్రధాని మోదీ తొలగించేందుకు మరోసారి ప్రయత్నం చేశారు. వేధింపులకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశమని, దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వ హక్కును ఊడలాక్కోదని తెలిపారు. కోల్‌కతా శివార్లలోని బేలూరు మఠంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, సీఏఏ ప్రాధాన్యత ఏమిటనేది ముఖ్యంగా యువత తెలుసుకోవాలన్నారు. మనచుట్టూ ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, అలాంటి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో ఇవాల్టి యువత విసిగి వేసారి పోతోందని అన్నారు. వాటన్నంటికీ వాస్తవ సమాచారంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పౌరసత్వ చట్టం ఒక్కరోజుతో తీసుకువచ్చినది కాదనే విషయం ఈశాన్య ప్రాంతాల ప్రజలు, బెంగాల్ ప్రజలు గ్రహించాలని కోరారు.
 
 
'వేరే దేశం నుంచి ఇక్కడకు వచ్చిన వారెవరైనా భారత రాజ్యాంగాన్నికి కట్టుబడి ఉంటే వారు ఇక్కడి పౌరులే అవుతారనే విషయం మనందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. సీఏఏ అనేది దానికి సవరణ మాత్రమే. ఇతర దేశాల్లో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి పౌరసత్వం కల్పించేందుకు మార్గం సుగమం చేస్తూ సీఏఏలో మార్పులు చేశాం' అని ఆయన చెప్పారు. సీఏఏ ద్వారా మైనారిటీలకు బాసటగా నిలవాలన్న మహాత్మాగాంధీ ఆశయాలను, కలలను తమ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. పాకిస్థాన్, ఇతర దేశాల్లో చిత్రహింసలకు గురైన ప్రజలకు ఇండియాలో మానవతా దృక్పథంతో పౌరసత్వం కల్పించాలని మహాత్మాగాంధీతో పాటు ప్రభుత్వంలోని పలువురు పదేపదే చెబుతూ వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. సీఏఏతో దేశంలోని ఏ ఒక్కరూ పౌరసత్వ హక్కును కోల్పోరని పునరుద్ఘాటించారు.