కోర్టుకు రాజమార్గంలో.. అసెంబ్లీకి దొడ్డిదారిన వెళ్లే ఏకైక సీఎం.

Published: Friday February 07, 2020

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు. రాజధానిని మార్చడం అన్యాయం అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టుకు రాజమార్గంలో వెళ్లి.. అసెంబ్లీకి దొడ్డిదారిన వెళ్తున్న ఏకైక సీఎం జగన్ అని విమర్శించారు. కేవలం చంద్రబాబుపై ఆక్రోశంతోనే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. సర్వేల పేరుతో పేదల పెన్షన్లను తొలగించిన పాపం జగన్‌ది అని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అయ్యన్న పేర్కొన్నారు. ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ జెండా రంగులు వేసి.. ఎన్నికల కోడ్ సమయంలో తెల్లరంగు వేయడానికి మళ్లీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.