కరోనా వైరస్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే

Published: Thursday October 22, 2020

రెండేళ్ల వరకు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. భారతదేశంలో కరోనా వైరస్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటేనని చెప్పారు. కరోనా వైరస్‌ను అపోహలతో  కొందరు తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అపోహలు వీడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించారు. భారత్ బయోటెక్, అరబిందో ఫార్మసీ సహా వివిధ కంపెనీలతో కలసి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై స్పష్టత రావొచ్చన్నారు. మూడు నెలలుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం చాలా కష్టమైన వ్యవహరమని చెప్పారు.

 

 

పరిశోధనలకు తోడు అదృష్టం కూడా కలసిరావాలని చెప్పారు. హైదరాబాద్ ఆసుపత్రుల్లో కరోనా రోగులు తగ్గటం సంతోషకరమన్నారు. ఆసుపత్రులను పరిశీలించి కరోనా వైరస్ పై అంచనాకు రాకూడదని ఆయన సూచించారు. పుట్టగొడుల్లో ఉండే పదార్థంతో AICతో కలసి ఇమ్యూనిటీ బూస్టర్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవటానికి కమ్యూనిటీ బూస్టర్ రోగనిరోధక శక్తిని పెంచుతోందన్నారు. ఆహారంతో కలపి ఇమ్యూనిటీ బూస్టర్ ను తీసుకోవాలని రాకేష్ మిశ్రా సూచించారు. చాలా కాలంగా భారతీయులు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పారు. ఇమ్యూనిటీ బూస్టర్ వలన ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు.