దేవాలయాల ఘటనలపై సుమన్ వ్యాఖ్యలు

Published: Sunday January 03, 2021

ఏపీలో చర్చనీయాంశంగా మారిన దేవాలయాల ఘటనలపై సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుమలలో లగడపాటి రాజగోపాల్ కుమార్తె పెళ్లికి హాజరైన సుమన్ అక్కడ మీడియాతో మాట్లాడారు. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల గురించి స్పందిస్తూ.. జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రతి పక్షాలు కుట్రలు చేసి ఉండొచ్చని సుమన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇతరులు కూడా ఈ ఘటనలకు పాల్పడి ఉండొచ్చన్నారు. దేవుడి విషయంలో తప్పు చేసిన వారికి కచ్చితంగా ఆ దేవుడే శిక్ష విధిస్తాడని సుమన్ అభిప్రాయపడ్డారు. ఆలయాలు, మసీదులు, చర్చిల భద్రతకు, పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుమన్ చెప్పారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు.

 

సినిమాల గురించి సుమన్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అయ్యాయన్నారు. థియేటర్లను పూర్తి స్థాయిలో తెరిచేందుకు ఇంకా మూడు నుంచి ఆరు నెలలు పట్టవచ్చని, త్వరలోనే చిత్ర సీమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు సుమన్ తెలిపారు.