తెలంగాణ తీరుపై కృష్ణా, గోదావరి బోర్డుల అసహనం

పూర్తిస్థాయి బోర్డు సమావేశం పెట్టాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం... తీరా సమావేశం ఏర్పాటు చేసే సమయానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంపై కృష్ణా, గోదావరి బోర్డులు అసహనం వ్యక్తం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా తదుపరి కార్యాచరణపై సోమవారం జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ గైర్హాజరైంది. ఏపీ నుంచి జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజర య్యారు. గెజిట్ అమలుకు అవసరమైన సహకారాన్ని ఏపీ అందిస్తోందని, తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తోందని ఈ సందర్భంగా ఇరు బోర్డుల అధికారులు ఆక్షేపించారు. ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 14వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని, ఇందుకు ఇరు రాష్ట్రాల సహకారం అవసరమని చెప్పారు.
బేషజాలు వదిలి బోర్డులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమన్వయ కమిటీ సమావేశానికి దూరంగా ఉంటూ పూర్తి స్థాయి బోర్డు సమావేశం పెట్టాలని తెలంగాణ పట్టుబట్టిందని, తీరా సమావేశం ఏర్పాటు చేస్తే హాజరు కాకపోవడం ఏ మాత్రం బాగోలేదని విచారం వ్యక్తం చేశారు. బోర్డుల నిర్వహణకు 60 రోజుల్లోగా ఇరు రాష్ట్రాలు చెరో రూ.400 కోట్లు (కృష్ణాకు రూ.400 కోట్లు, గోదావరికి రూ.400 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని, దీనికోసం ఇప్పటికే లేఖలు రాశామని గుర్తుచేశారు. ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ, కేంద్రం జారీ చేసిన గెజిట్ను స్వాగతిస్తున్నామన్నారు. వ్యవస్థాపరమైన నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని సమకూరుస్తామని బోర్డులకు నివేదించారు. గెజిట్లోని షెడ్యూల్-2 ప్రాజెక్టులపై మార్పులు కోరామన్నారు. షెడ్యూల్-3 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటూ బోర్డుల సలహాలతో కార్యకలాపాలు చేస్తుంటాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం కొన్ని ప్రాజెక్టులకు రక్షణ కల్పించిందని, ఆ ప్రాజెక్టులు గెజిట్లో లేకపోవడంపై అభ్యంతరం చెబుతున్నామన్నారు. గెజిట్పై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు సూచించిన నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. బోర్డులకు నిధుల విడుదలపై అవసరమైన కసరత్తు ప్రభుత్వ స్థాయిలో జరుగుతుందన్నారు. అక్టోబరు 14వ తేదీ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని, దీన్ని స్వాగతిస్తున్నామని విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.
కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం జలసౌధలోని ఐదో అంతస్తులో జరిగింది. ఆ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయం తీసుకున్న తెలంగాణ అధికారులు అనుకున్నట్లుగానే సమావేశానికి దూరంగా ఉండిపోయారు. సరిగ్గా సమావేశం జరుగుతున్న సమావేశ మందిరానికి 15 అడుగుల దూరంలో ఉన్న చాంబర్లోనే నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్రావు, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్లు సమావేశమయ్యారు. గెజిట్పై అభ్యంతరాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సమీక్ష జరిపారు. ఎన్జీటీతో పాటు సుప్రీంకోర్టులో కీలక కేసులు ఉన్నందున మరో తేదీన సమావేశం జరపాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు లేఖ రాసింది. ఏపీలో పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఏపీ అధికారులు సమావేశానికి వచ్చారని, తెలంగాణ అధికారులు జలసౌధలోనే ఉంటూ ఉద్దేశ పూర్వకంగానే భేటీకి దూరంగా ఉన్నారని బోర్డు అధికారులు మండిపడ్డారు. సమావేశం అనంతరం గోదావరి, కృష్ణా బోర్డులు సంయుక్త ప్రకటన ఇచ్చాయి.
గోదావరి బోర్డు పదో సమావేశం, కృష్ణా బోర్డు 13వ సమావేశం సోమవారం జలసౌధలో జరిగింది. కేంద్రం గెజిట్ను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయడానికి వీలుగా గెజిట్లోని క్లాజుల వారీగా చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాం. తెలంగాణ సభ్యులెవరూ హాజరు కాలేదు. గెజిట్ విడుదలైన 30 రోజుల్లోగా(ఆగస్టు 14 లోగా) వ్యవస్థాపరమైన నిర్మాణానికి నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు అందిస్తామని ఏపీ హామీ ఇచ్చింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్లో క్లాజుల వారీగా, ప్రాజెక్టుల వారీగా కొన్ని మార్పులు చేయాలని ఏపీ సభ్యులు కోరారు. బోర్డుల నిర్వహణకు తమ వాటా నిధులను అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఏపీ అధికారులు వివరించారు. ప్రాజెక్టులపై కేంద్ర పారిశ్రామిక బలగాలు(సీఐఎ్సఎఫ్) మోహరింపు అంశం కేంద్ర హోంశాఖ వద్ద ఉంది.

Share this on your social network: