ఉప ఎన్నిక లేనట్లేనా

రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. ఆగస్టు 30 లోపు పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు, 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై అభిప్రాయాలు తెలియజేయాలని లేఖ కోరింది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు ఉపఎన్నికలపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆగస్టు 30 తరువాతే ఏపీ, తెలంగాణాలో ఉపఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలుపై సెప్టెంబర్ రెండో వారం తరువాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వాహణపై గతంలో ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టుల అక్షింతల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలతోనే ముందుకు వెళ్లాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో ఉన్న స్థానిక పరిస్థితులు తెలపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. హుజురాబాద్తో పాటు త్వరలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉండటంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేర్పులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీసుల వినియోగం, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది తదితర వివరాలను సీఈసీ కోరింది. ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా 103 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక అదే తరహాలో వాయిదా పడుతుందని టీఆర్ఎస్ భావించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలు అయ్యే అవకాశం ఉండటంతో గులాబీ దళం కాస్త ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ ఎపిసోడ్తో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతర పరిణామాలు, సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Share this on your social network: