9 నెలల్లోనే మళ్లీ మొదటికి.. కొత్తగా డ్రోన్ సర్వేకు టెండర్లు

సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే మొదటికొచ్చింది. సర్వే ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమైందో గాని.. డ్రోన్ సర్వే చేసేందుకు జగన్ ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆధార్ నంబరును ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్రంలో ప్రతి భూమికీ 12 అంకెల విశిష్ట సంఖ్య ఉండాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 2019లో భూధార్ ప్రాజెక్టును ప్రారంభించింది. సర్వే నంబర్ల వారీగా ప్రతి భూమికి భూధార్ నంబరు ఇచ్చి దానిని ఆక్షాంశ, రేఖాంశాలతో జత చేయాలనుకున్నారు. దీనివల్ల భూముల వివాదాలు నిరోధించవచ్చని. ప్రతి ల్యాండ్ పార్సిల్కు జీపీఎస్ అనుసంధానమవడం వల్ల సాంకేతికంగా ముందడుగు పడుతుందని నాటి సర్కారు భావించింది. జగన్ ప్రభుత్వం రాగానే భూధార్ను భూస్థాపితం చేశారు. అయితే ఆ ప్రాజెక్టు అమలు కోసం ఇచ్చిన జీవోల ఆధారంగానే భూముల సమగ్ర సర్వేకు ప్రణాళికలు వేశారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సమగ్ర సర్వే చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
భూధార్ పోయినా.. రీ సర్వే జరగబోతున్నందుకు అంతా సంతోషించారు. కానీ సీఎం ప్రకటనలను రెవెన్యూ. సర్వే శాఖల అధికారులు కొందరు సీరియ్సగా తీసుకోలేదు. కార్స్నెట్వర్క్ను సమకూర్చుకోవడం, టెండర్లు, ఆర్ఎ్ఫపీ, సాఫ్ట్వేర్ మొదలు అనేకానేక అంశాల్లో పలు వివాదాలు తెచ్చిపెట్టారు. వీటిలోని లోపాలను ఎప్పటికప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘ఆంధ్రజ్యోతి’ రాసింది కాబట్టి నిజమయినా సరే నమ్మలేమంటూ సర్కారు అధికారులను వెనకేసుకొచ్చింది. ఫైళ్లు మీడియా ముందు పెడుతున్నామంటూ హడావుడి చేసింది. చివరకు ‘ఆంధ్రజ్యోతి’ సంధించిన ప్రశ్నలకు బదులివ్వలేకపోయింది.
అనేక సందేహాలు, వివాదాల నడుమే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక సర్వే రిపోర్టులోనూ అనేక లోపాలున్నాయి. రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకున్న కార్స్ నెట్వర్క్లో లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా (ఎస్వోఐ) నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే ‘ఆంధ్రజ్యోతి’కి ప్రభుత్వ పెద్దలు కుట్రలు, కుతంతాలు ఆపాదించారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలతో సంబంధం లేకుండానే గత ఏడాది డిసెంబరు 21న జగ్గయ్యపేట మండలంలోనే సీఎం చేతులమీదుగా సమగ్ర భూ సర్వేను ప్రారంభించారు. సర్వే ఆఫ్ ఇండియాతో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వేచేసి మ్యాపులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం సమక్షంలోనే సంతకాలు చేశారు. రూ.987 కోట్ల వ్యయంతో చేపట్టిన రీ సర్వేను 2023 నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆయన కోరిక మేరకు భూముల సర్వేను దిగ్విజయంగా పూర్తిచేస్తామని.. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా నిలబెడతామని ఈ నెల 12న తాడేపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు భరోసా ఇచ్చారు. రీ సర్వే అద్భుతంగా జరుగుతోందని, అక్టోబరు నాటికి 51 గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతుందని రైలుబొమ్మలతో కూడిన పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇది జరిగిన 16 రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది. డ్రోన్ సర్వేకు ఏజెన్సీలు కావాలంటూ సర్కారు టెండర్లు పిలిచింది. 17,460 గ్రామాలు, 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే చేయాలని అందులో పేర్కొన్నారు.

Share this on your social network: