కోర్టు కోసమే ఈ-గజిట్ డ్రామా

కోర్టు కళ్లకు గంతలు కట్టాలనుకున్న సర్కారు డ్రామా అధికారికంగా బయటపడింది. ఎవరో గిట్టని వారు కాదు.. తన చర్యలతో సర్కారే తన గుట్టు తానే రట్టు చేసుకోవడం గమనార్హం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) ఈ-గజిట్లో అప్లోడ్ చేస్తామని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు ఆ సమాచారాన్ని పొందవచ్చంటూ ఈనెల 7వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తో జీవో 100 జారీ చేయించారు. 72 గంటలు గడిచినా ఆ జీవోని ఈ-గజిట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. గురువారం రాత్రి వరకు ఆ జీవోని రహస్యంగానే ఉంచారు. అంతేనా...ఆ జీవో ఆధారంగా ప్రజలకు తెలియాల్సిన రెగ్యులర్ ఉత్తర్వులను కూడా అందులో అప్లోడ్ చేయడం లేదని తేటతెల్లం అయింది. గురువారం మొత్తం మీద సర్కారు ఒకే ఒక్క గజిట్ నోటిఫికేషన్ 414ని అప్లోడ్ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ఈనెల 8న జారీ చేసిన జీవో 1468ని గజిట్గా నోటిఫై చేస్తూ ప్రకటించినదే అది.
ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారుల ఎంపిక సంవత్సరాన్ని, వారి క్వాలిఫై సర్వీసును ప్రకటిస్తూ కేంద్ర సర్కారు ఇచ్చిన ఆదేశాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఈ అంశంపై ఎలాగూ గజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ-గజిట్లో అప్లోడ్ చేశారు. ఇక ఇంతకుమించి ఒక్క జీవోను కూడా కొత్తగా పొందుపరచలేదు. వారాంతపు గజిట్లో హైకోర్టులో రిజిస్ట్రార్ పోస్టుల గజిట్ను అప్లోడ్చేశారు. ఇదీ గజిట్గా తప్పనిసరిగా ప్రకటించి అప్లోడ్ చేయాల్సిన అంశమే. కానీ, గురువారం జారీ చేసిన ముఖ్యమైన జీవోలను అందులో అప్లోడ్ చేయలేదు. ఈ చర్య ప్రభుత్వం జారీ చేసిన 100కు పూర్తి విరుద్దమైనదే. తాను ఇచ్చిన ఉత్తర్వులను సర్కారే ఉల్లంఘించడంతో తన డ్రామాను బయటపెట్టేసుకున్నట్లయింది. ఇది కాదా మోసం? ఇది కాదా మాయా? అని సమాచార హక్కు ప్రతినిధులు నిలదీస్తున్నారు.

Share this on your social network: