60 అంతస్థుల భవనంలోంచి మంటలు..

Published: Friday October 22, 2021

అది 60 అంతస్థుల భవనం. ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 11.51 గంటల ప్రాంతంలో ఆ భవనంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 19వ ఫ్లోర్‌లో ఉన్న ఓ 30ఏళ్ల వ్యక్తి మంటల్లో చిక్కుకున్నాడు.  ప్రాణాభయంతో అటూఇటూ పరుగులు తీశాడు. చివరికి అగ్ని కిలల భారీ నుంచి తప్పించుకోవడానికి.. గ్రిల్స్ పట్టుకుని కిందకు వేలాడాడు. అయితే 10 నిమిషాల తర్వాత ఘెరం జరిగిపోయింది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ముంబైలోని కర్రీ రోడ్‌లో ఉన్న 60 అంతస్థుల భవనంలో నిర్మాణ పనులు జరుగుతుండగానే శుక్రవారం 11.51 గంటలకు ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు 19వ ఫ్లోర్ వరకూ వ్యాపించాయి. ఈ క్రమంలో 19వ ఫ్లోర్‌లో ఉన్న అరుణ్ తివారీ (31) మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో ప్రాణ భయంతో అటూఇటూ పరుగులు తీసిన అతడు.. సాయం కోసం అర్థించాడు. అగ్ని కీలలు ఎగసి పడుతున్నందున ఎవరూ అతడికి సాయం చేయలేకపోయారు. ఈ క్రమంలో అతడు మంటల నుంచి తప్పించుకునేందుకు గ్రిల్స్ పట్టుకుని.. 19వ అంతస్థు నుంచి కిందకు వేలాడాడు. సుమారు 10 నిమిషాలపాటు గ్రిల్స్‌ను పట్టుకునే వేలాడిన అతడు.. పట్టు జారడంతో కింద పడి ప్రాణాలు వదిలాడు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. బిల్డింగ్‌లో మంటలను ఆర్పేందుకు 12 అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయి. నగర మేయర్ కూడా ఘటనా స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కాగా.. బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.