‘బంగారం పంపించడం మీ వంతు - అమ్మ వారికి సమర్పించడం మా వంతు’

మేడారం జాతర నేపథ్యంలో ప్రత్యేక కార్గో పార్సిల్ సేవలను టీఎస్ ఆర్టీసీ ఈనెల 12 నుంచి అందుబాటులోకి తేనుంది. వివిధ కారణాలతో సమ్మక్క- సార క్కల దర్శనానికి వెళ్లలేని భక్తులకు ఇది ప్రత్యేకం. ఇందుకోసం ‘బంగారం పంపించడం మీ వంతు - అమ్మ వారికి సమర్పించడం మా వంతు’ నినాదంతో ఆర్టీసీ ముందుకొచ్చింది. అమ్మవార్లకు మొక్కుగా చెల్లించాలనుకునే బంగారాన్ని పార్సిల్లో భక్తులు బుక్ చేస్తే చాలు.. దాన్ని నేరుగా సమ్మక్క- సారక్క అమ్మవార్లకు సమర్పించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు.. అమ్మవారికి భక్తుల బంగారాన్ని చేర్చిన తర్వాత, 200 గ్రాముల ప్రసాదంతో పాటు పసుపు కుంకుమ, అమ్మవారి ఫొటోను కూడా తిరిగి భక్తుల ఇళ్లకు ఆర్టీసీ చేరవేయనుంది.
దీనికోసం ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో మీసేవల ద్వారా ‘టీ యాప్ ఫోలియో యాప్’లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సేవలకుగానూ ఒక ప్రసాదం ప్యాకెట్కు రూ. 225 చొప్పున భక్తులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. గరిష్ఠంగా 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను భక్తులు పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో దాన్ని అమ్మవారికి సమర్పించడంతో పాటు సంబంధిత భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తామని టీఎ్సఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్లు టీఎ్సఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Share this on your social network: