సీఐడీ చీఫ్కు స్థానచలనం.. ఏసీబీ డీజీ, హోం కార్యదర్శికి కూడా?

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి తనదైన జట్టును సిద్ధం చేసుకోవడంలో బిజీ అయ్యారు. హెచ్ఓడీల నుంచి జిల్లా ఎస్పీల వరకూ ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలన్న దానిపై విస్తృత కసరత్తు సాగుతోంది. టీంని సిద్ధం చేసుకుని సీఎం జగన్ అనుమతి తీసుకున్న మరుక్షణమే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. రాయలసీమలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్కు ఇటీవలే డీఐజీగా పదోన్నతి లభించింది. దీంతో ఆయన ఏదో ఒక రేంజ్కు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా కడప ఎస్పీ అన్బురాజన్ బదిలీ కూడా జరగొచ్చని ప్రచారం సాగుతోంది. ఏడు నెలల క్రితమే అనంతపురం ఎస్పీగా వచ్చిన ఫక్కీరప్ప బదిలీ ఉండకపోవచ్చని అంటున్నారు. గుంటూరు రేంజ్లో రెండు జిల్లాల ఎస్పీల బదిలీ ఉండొచ్చని చెబుతున్నారు. అవినీతి ఆరోపణలతోపాటు వివాదాలు కూడా ఆ ఇద్దరిపై ఎక్కువగా ఉండటంతో ట్రాన్స్ఫర్ తప్పదంటున్నారు. ఏలూరు రేంజ్లోని ఒక జిల్లా ఎస్పీ పని కన్నా, ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయనకు స్థాన చలనం తప్పక పోవచ్చని ప్రచారం. దీనికితోడు జిల్లాలో కొందరు అధికారుల అవినీతి, కేసినో వివాదం, తాజాగా బీజేపీ నాయకుడి హత్య... ఘటనలు ఆ ఎస్పీకి ఇబ్బంది తెచ్చిపెట్టినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మరో జిల్లాలో కింది స్థాయి సిబ్బంది అవినీతి గురించి ఫిర్యాదులున్నప్పటికీ... మంచిపేరున్న అధికారి కావడంతో ‘జాగ్రత్తగా పని చేసుకో’ అని డీజీపీ చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం, డీజీపీల జిల్లాకు చెందిన వ్యక్తి కావడం కూడా ఆయనకు కొంత ఉపశమనంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ పనితీరుపై పోలీసు బాస్ పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం, విశాఖటపట్నం జిల్లాల ఎస్పీలను మార్చే అవకాశం ఉన్నా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే అంటున్నారు.
రాష్ట్రంలో ఐదు రేంజ్లకుగానూ నాలుగు రేంజ్లకు కొత్త డీఐజీలను నియమించే అవకాశం ఉంది. అనంతపురం డీఐజీగా పనిచేసిన క్రాంతి రాణా టాటా ఇటీవలే విజయవాడ పోలీస్ కమిషనర్గా బదిలీ అయ్యారు. రెండు నెలలుగా ఆ రేంజ్కు కర్నూల డీఐజీ వెంకట్రామిరెడ్డి ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కర్నూలు రేంజ్లో రెండున్నరేళ్లకు పైగా పనిచేస్తున్నందున ట్రాన్స్ఫర్ తప్పనిసరి అంటున్నారు. అనంతపురం రేంజ్కు ఆవుల రమేశ్ రెడ్డి పేరు వినిపిస్తుండగా కర్నూలు రేంజ్కు పీహెచ్డీ రామక్రిష్ణకు అవకాశం లభించవచ్చంటున్నారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం మేరకు గుంటూరు రేంజ్ నుంచి త్రివిక్రమ్ వర్మను కదపక పోవచ్చు. ఏలూరు రేంజ్కు ఏసీబీలో పనిచేస్తున్న ఓ అధికారికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. విశాఖపట్నం రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు ఇటీవలే ఐజీగా పదోన్నతి పొందడంతో ఆయన బదిలీ తప్పనిసరి. అక్కడ ఎస్సీ లేదా బీసీ అధికారికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా కూడా బదిలీపైనా ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతోంది.

Share this on your social network: