హరికృష్ణ అంతిమయాత్రలో మార్పు

Published: Friday August 31, 2018

రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంతిమయాత్రలో మార్పు చోటు చేసుకుంది. తొలుత ప్రకటించినట్లు కాకుండా.. హరికృష్ణను ఎన్టీఆర్ భవన్ కు తీసుకురాకుండానే ఇంటి నుంచి మహాప్రస్థానానికి తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. హరికృష్ణకు ఎన్టీఆర్ భవన్ తో ఎంత అనుబంధం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.మొదట అనుకున్న దాని ప్రకారం హరికృష్ణ ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలై.. ఎన్టీఆర్ భవన్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు అభిమానులు.. పార్టీ వర్గాల సందర్శన కోసం ఉంచాలనుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మహాప్రస్థానం శ్మశాన వాటికకు తీసుకెళ్లి తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల్ని పూర్తి చేద్దామని భావించారు.
 
ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఎన్టీఆర్ భవన్ వద్దకు హరికృష్ణను తీసుకెళ్లాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హరికృష్ణ కుటుంబానికి చెందిన పండితుడి సూచనతోనే ఈ మార్పు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంటి దగ్గర పార్థిపకాయానికి జరపాల్సిన తంతు జరుగుతుందని.. అనంతరం నేరుగా శ్మశాన వాటికకు తరలించాలే కానీ.. మధ్యలో ఆగకూడదన్న సూచనతో ఎన్టీఆర్ భవన్ వద్దకు హరికృష్ణను తీసుకెళ్లాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.