విశాఖ చేరుకున్న మానవ రోబో..

Published: Thursday October 25, 2018

ప్రపంచంలో తొలి మానవ రోబో సోఫియా విశాఖలో సందడి చేసింది. విశాఖపట్నంలో జరుగుతున్న ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు సోఫియా బుధవారం ఇక్కడకు చేరుకుంది. ‘హాయ్‌ వైజాగ్‌...’ అంటూ పలకరించి.. ‘మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ఐదు నిమిషాలపాటు స్టేజీపైనే ఉన్న సోఫియా ‘మళ్లీ రేపు కలుద్దాం’ అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించింది. సోఫియాతో సెల్ఫీలు దిగేందుకు టెకీలంతా ఉత్సాహం చూపించారు. సోఫియా మంగళవారమే హాజరు కావాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యల వలన సాధ్యం కాలేదని ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి తెలిపారు. నోవాటెల్‌లో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి లోకేశ్‌, 15 దేశాల నుంచి వచ్చిన అతిథులతో గురువారం మధ్యాహ్నం సోఫియా ముచ్చటించనుంది. అనంతరం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి సోఫియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంభాషిస్తారు.