రుణవిముక్తి చేశాకే ఎన్నికలకు..

Published: Wednesday February 06, 2019
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. à°ˆ రంగంలో నాలుగేళ్లలో జాతీయ సగటు వృద్ధిరేటు 2.4శాతం ఉంటే, ఏపీలో 11శాతం ఉందని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వర్షాభావం ఏర్పడినా ఎదుర్కొని అధిగ దిగుబడి సాధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై మంగళవారం అసెంబ్లీలో చేపట్టిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. ‘‘2004 నుంచి 2014 వరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువుల్లేక, విత్తనాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యుత్‌షాక్‌లతో మృత్యువాత పడ్డారు. చివరికి కోనసీమలో కూడా క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ విధానం తీసుకొచ్చింది. నాలుగేళ్లలో వ్యవసాయ రంగానికి రూ.81వేల కోట్లు ఖర్చుచేశాం. రైతుల ఆదాయం 97శాతం పెంచాం. ప్రకృతి సేద్యంలో 8శాతం వృద్ధి సాధించాం’’ అని వివరించారు.
 
కేంద్రం రైతులకు అన్ని రకాలుగా అన్యాయం చేసిందని విమర్శించారు. ఐదు ఎకరాలు ఉన్న కుటుంబానికి రూ.6వేలు ఇస్తామని ప్రకటించారని, అంటే రైతుకు రోజుకు రూ.17 వస్తాయని, ఇది రైతుకు భిక్షం వేస్తున్నట్టుగా ఉందని మండిపడ్డారు. ఫసల్‌ బీమా పథకమే పెద్ద ఫార్సు అని ఆరోపించారు. తమ ప్రభుత్వం జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంలోకి వస్తున్నారని, 2024 నాటికి అందరూ ఇదే విధానంలోకి వస్తారన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక ఎవరూ చేయనివిధంగా రైతుకు రూ.లక్షన్నర చొప్పున రుణవిముక్తి చేశాం. ఇంకా కొందరికి అందాలి. అందరికీ రుణవిముక్తి చేశాకే ఎన్నికలకు వెళ్తాం. అప్పట్లో మోదీ రుణవిముక్తి వద్దన్నారు. ఆర్‌బీఐ కూడా వద్దని చెప్పింది. అయినా రైతుల కోసం అమలు చేశాం’’ అని వివరించారు.