బీఆర్‌ అంబేడ్కర్‌ పట్ల జగన్‌ సోదరి షర్మిల నిర్లక్ష్యం

Published: Monday April 08, 2019

దళితుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పట్ల వైసీపీ నాయకురాలు, జగన్‌ సోదరి షర్మిల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయననే పట్టించుకోని వైసీపీ నేతలు తమకేం న్యాయం చేస్తారని దళిత నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ నిర్మాతను, దళితులను తీవ్రంగా అవమానించడమేనని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో షర్మిల ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, షర్మిల ప్రచారానికి వెళ్లిన మార్గంలోని యానాం సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఉన్నప్పటికీ.. కిందకు దిగి అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించకుండా తన మానాన తాను వెళ్లిపోవడంపై దళిత సంఘాల నాయకులు షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌నే పట్టించుకోని వైసీపీ నేతలు తమకేం న్యాయం చేస్తారని దళిత నాయకుడు కాశి సత్యనారాయణ తదితరులు విమర్శించారు. కనీసం వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అంబేడ్కర్‌ను గుర్తించలేదని విమర్శించారు. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.