మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ

Published: Thursday September 10, 2020

మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం స్పష్టం చేసింది. రుణగ్రహీతల ఖాతాలను మరో రెండు నెలలపాటు నిరర్థక ఆస్తులుగా ప్రకటించొద్దని ఇటీవల సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. రుణగ్రహీతలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆ సందర్భంలో సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది.

 

రుణాలపై కేంద్రం, ఆర్బీఐ నిర్ణయాలను కోర్టు ముందుంచాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. అన్ని రంగాల రుణాలు, రుణగ్రహీతల అంశాలపై కేంద్రం, ఆర్బీఐ చర్చించాలని ఆదేశించింది. చర్చల సారాంశంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలుకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువిచ్చింది.

 

కరోనా నేపథ్యంలో రుణాలు, ఈఎంఐల చెల్లింపుపై రెండు విడతలుగా మూడు నెలల చొప్పున కేంద్రం మారటోరియం విధించింది. అయితే.. మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడమనేది ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని కేంద్రం, ఆర్బీఐ తరఫున తుషార్‌ మెహతా ఇప్పటికే సుప్రీంకు స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన అఫిడవిట్‌ను ధర్మాసనానికి సమర్పించారు. మారటోరియం సమయంలో వాయిదాల మీద వడ్డీ విధించాలనేదే కేంద్రం యోచన అని ఆయన తెలిపారు.