2 నిమిషాల్లో కరోనా పరీక్ష.. పావుగంటలో ఫలితం

ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడానికి వీలుగా హోం టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ కిట్తో రెండు నిమిషాల్లో పరీక్ష చేసుకోవచ్చు. పావుగంటలో ఫలితం తెలిసిపోతుంది. దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.250. పుణెకు చెందిన ‘మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్’ రూపొందించిన ఈ కొత్త హోం టెస్ట్ కిట్ పేరు.. కొవిసెల్ఫ్. ప్రభుత్వ కేంద్రాల్లో చేస్తున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ లాంటిదే ఇదీ. ఐసీఎంఆర్ దీని వినియోగానికి అనుమతిచ్చింది. వచ్చేవారాంతానికి ఇది దేశవ్యాప్తంగా ఉన్న 7 లక్షల మందుల షాపుల్లో, ఆన్లైన్ ఫార్మసీల్లో అందుబాటులోకి వస్తుందని మైల్యాబ్స్ డైరెక్టర్ సుజీత్ జైన్ తెలిపారు. దేశంలోని 90ు ప్రదేశాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. కిట్తో పాటు అందించే మాన్యువల్ ద్వారా ఈ టెస్టును ఇంట్లోనే ఎవరికి వారు చేసుకోవచ్చని.. దీంట్లో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష అక్కర్లేదని తెలిపారు.
అయితే.. కరోనా లక్షణాలున్నా, ఈ టెస్టులో నెగెటివ్ వస్తే మాత్రం వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. అలాగే.. అందుబాటులో ఉందని ఎప్పుడు పడితే అప్పుడు ఈ టెస్టు చేసుకోవద్దని పేర్కొంది. ‘‘ల్యాబ్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్గా తేలినవారికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, కరోనా లక్షణాలున్నవారు మాత్రమే ఈ టెస్టు చేసుకోవాలి’’ అని సూచించింది. ఇలాంటి హోమ్ టెస్ట్ కిట్లను అమెరికా, యూకే తదితర దేశాల్లో ఇప్పటికే ప్రజలు వినియోగిస్తున్నారు.
కొవిసెల్ఫ్ కిట్లో ముందే ఒక ద్రావకాన్ని నింపిన ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్, స్టెరైల్ చేసిన నేజల్ స్వాబ్, ఒక టెస్ట్ స్ట్రిప్, బయోహజార్డ్ బ్యాగ్ ఉంటాయి. ఈ కిట్ను వినియోగించేవారు తొలుత ‘మైల్యాబ్ కొవిసెల్ఫ్’ అనే యాప్ ను గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ నుంచి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. (టెస్టు ఎలా చేసుకోవాలి? ఫలితం తెలుసుకోవడం ఎలా? వంటి విషయాలన్నీ ఆ యాప్లో ఉంటాయి). అనంతరం టెస్ట్ కిట్ను తెరిచి అందులోని నేజల్ స్వాబ్ను ఒకదాని తర్వాత ఒకటిగా ముక్కు రం ధ్రాలు రెండింటిలోకి 4-5 సెంటీమీటర్ల మేర పెట్టి నాలుగైదుసార్లు అటూఇటూ తిప్పాలి. దీంతో లోపల ఉన్న శ్లేష్మం స్వాబ్కు అంటుకుంటుంది. ఆ స్వాబ్ను బయటకు తీసి ముందే ద్రావకం నింపి ఉన్న ట్యూబ్లో పెట్టి మూత బిగించాలి.
అనంతరం ఆ ట్యూబ్ ద్వారా టెస్ట్స్ట్రిప్పైకి రెండు చుక్కల ద్రావకాన్ని వెయ్యాలి. టెస్ట్స్ట్రిప్పై రెండు గీతలుంటాయి. ఒకటి కంట్రోల్ సెక్షన్. రెండోది టెస్ట్ సెక్షన్. స్ట్రిప్పై ద్రావకం వేసిన తర్వాత కొద్దిసేపటికి కంట్రోల్ సెక్షన్ గీత మాత్రమే ఎర్రగా అయితే నెగెటివ్గా భావించాలి. కంట్రోసెక్షన్తోపాటు టెస్ట్ సెక్షన్ గీత కూడా(రెండు గీతలూ) ఎర్రగా వస్తే పాజిటివ్గా పరిగణించాలి. సాధారణంగా 5-7 నిమిషాల్లోపే ఫలితం తెలిసిపోతుంది. కొందరిలో 15 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాల తర్వాత వచ్చే ఫలితమేదైనా అది చెల్లనిదే. టెస్ట్ పూర్తయ్యాక ఫలితం పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏ మొబైల్లో మీరు కొవిసెల్ఫ్ యాప్ను ఇన్స్టాల్ చేశారో ఆ మొబైల్ ద్వారా టెస్ట్ స్ట్రిప్ను ఫొటో తీయాలి. అప్పుడా యాప్ పరీక్ష ఫలితాన్ని గ్రహించి ఐసీఎంఆర్ సెంట్రల్ సర్వర్కు పంపుతుంది. ఈ కిట్ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీలపై భారం భారీగా తగ్గుతుందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. లక్షణాలు కనిపించాక కూడా ల్యాబ్ల వద్దకు వెళ్లి టెస్టు చేయించుకుని రోజుల తరబడి ఫలితం కోసం ఎదురుచూడాల్సిన అవస్థ కూడా తప్పుతుందని వారు పేర్కొంటున్నారు.
పుక్కిలింత పరీక్ష..
ముక్కులో, నోట్లో స్వాబ్లు పెట్టి నమూనాలు తీసే క్రమంలో చాలా మంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాదే విదేశాల్లో ‘సెలైన్ వాటర్ గార్గిల్ ఆర్టీపీసీఆర్’ టెస్టును అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడది భారతదేశానికీ వచ్చింది. ఈ టెస్టుకు భారత వైద్య పరిశోధన మండలి ఇటీవలే అనుమతిచ్చింది. ఈ కొత్త పరీక్షా విధానం చాలా సులభం. కొన్ని మిల్లీలీటర్ల సెలైన్ నీరున్న ఒక గాజు పాత్ర ఇస్తారు. ఆ పాత్రలోని నీటిని నోట్లోకి తీసుకుని 30 సెకన్లపాటు పుక్కిలించి మళ్లీ అదే గాజు పాత్రలో పోసి మూత పెట్టేయాలి. ఆ నమూనాను మామూలుగా ఆర్టీపీసీఆర్ విధానంలో పరీక్షించి ఫలితం చెబుతారు. ఎవరికివారే ఈ పుక్కిలింత నమూనా ఇవ్వగలరు కాబట్టి శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు, వారికి పీపీఈ కిట్లు అక్కర్లేదు. దేశంలోని ఇతర కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్స్కు కూడా దీనిపై శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించినట్టు ఈవీసీ ట్విటర్లో తెలిపింది.
లాలాజల నమూనాల్లో కరోనా వైర్సను కేవలం ఒక్క సెకనులో గుర్తించే సరికొత్త సెన్సర్ వ్యవస్థను విదేశీ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కరోనా టెస్టుల్లో పరమ ప్రామాణికమైనది ఆర్టీపీసీఆర్ పరీక్ష. ఈ టెస్టు చేసేటప్పుడు సేకరించిన నమూనాల్లో వైరస్ ఉంటే, దాన్ని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతిలో రెట్టింపు చేయడం ద్వారా గుర్తిస్తారు. కానీ, ప్రస్తు త పరిస్థితుల్లో, ఎక్కువ పరీక్షలు చేయాల్సి వస్తున్నందున ఆ ప్రక్రియకు 24 గంటలకు పైనే సమ యం పడుతోంది. ఈ నేపథ్యంలో అదే ప్రక్రియను మరింత వేగంగా, కచ్చితంగా చేసే విధానాన్ని శాస్త్రజ్ఞులు రూపొందించినట్టు ‘వాక్యూమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీ’ జర్నల్లో ప్రచురితమైంది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న షుగర్ టెస్టు స్ట్రిప్ల తరహాలోనే తాము ఒక ‘బయో సెన్సర్ స్ట్రిప్’ను రూపొందించామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న కెమికల్ ఇంజనీరింగ్ డాక్టొరల్ అభ్యర్థి మిన్ఘన్ షియాన్ తెలిపారు.
ఆ స్ట్రిప్ కొసభాగంలో సూక్ష్మమైన ‘మైక్రోఫ్లూయిడిక్ చానల్’ ఉంటుందని షియాన్ వెల్లడించారు. వైరస్ సోకినట్టు అనుమానం ఉన్నవారి లాలాజలాన్ని సేకరించి ఆ నమూనాను ఈ మైక్రోఫ్లూయిడిక్ చానల్లో వేయాలి. ఆ చానల్లో కొన్ని ఎలకో్ట్రడులుంటాయి. వాటిలో ఒకదానికి బంగారంతో పూత పూస్తారు. ఆ పూతపై కొవిడ్ సంబంధిత యాంటీబాడీ్సను రసాయన పద్ధతిలో జతచేస్తారు. పరీక్ష చేసేటప్పుడు ఈ సెన్సర్ స్ట్రిప్లను ఒక కనెక్టర్ ద్వారా ఒక సర్క్యూట్ బోర్డుకు అనుసంధానం చేస్తారు. లాలాజల నమూనా స్ట్రిప్పై వేయగానే సూక్ష్మ విద్యుత్తు ప్రవాహం గోల్డ్ ఎలకో్ట్రడ్ నుంచి రెండో ఎలకో్ట్రడ్కు ప్రవహిస్తుంది. ఆ సంకేతాన్ని సర్క్యూట్ బోర్డు గ్రహించి ఒక ట్రాన్సిస్టర్ సాయం తో దాన్ని రెట్టింపు చేస్తుంది. అప్పుడా సంకేతం స్ర్కీన్ మీద ఒక అంకె రూపంలోకి మారి కనిపిస్తుందని షియాన్ వివరించారు. పరీక్షిస్తున్న నమూనాలో వైరల్ ప్రొటీన్ సాంద్రత ఎంత ఉందనే దాని ఆధారంగా మనకు తెరపై కనపడే అంకె/సంఖ్య ఉంటుంది. ఇతర వ్యాధులను గుర్తించడానికి కూడా దీన్ని వినియోగించవచ్చు.

Share this on your social network: