ప్రతి నిరుపేదకూ మంచి వైద్య సదుపాయాలు

పేదరికం వల్ల వైద్యం అందుకోలేక అన్యాయానికి గురవుతున్న ప్రతి నిరుపేదకూ మంచి వైద్య సదుపాయాలు అందిస్తానని పాదయాత్రలో చేసిన హామీని నిలుపుకొంటున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అందులోభాగంగానే 14 మెడికల్, నర్సింగ్ కాలేజీలకు ఒక్క రోజే శంకుస్థాపన చేస్తున్నానన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్విధానంలో ముఖ్యమంత్రి మీట నొక్కి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కాలేజీలు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఏర్పాటవుతాయని, రాష్ట్రంలో మొత్తంగా 16 హెల్త్ హబ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటిలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రైవేటు రంగంలోనూ వస్తాయన్నారు. ఇవి ఏర్పాటైతే జిల్లాల్లో వైద్య రంగం రూపురేఖలు మారిపోతాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు సంబంధించి.. ఇప్పటికే పాడేరు, పులివెందులలో పనులు మొదలయ్యాయని, మిగిలిన విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమహేంద్రవరం, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి టైర్ వన్ సిటీలుగానీ, అక్కడ ఉండేలాంటి కార్పొరేట్ ఆస్పత్రులుగానీ లేవన్నారు. అయినా ఆ లోటును కొత్తగా ప్రారంభిస్తున్న మెడికల్ కాలేజీలు తీరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొవిడ్తో మరణించిన ఫ్రంట్లైన్ వారియర్లకు కేంద్రం ప్రకటించిన రూ.5 లక్షలు పరిహారం అందకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే అందించేలా విధివిధానాలు ఖరారుచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్దా్సను సీఎం జగన్ ఆదేశించారు. కొవిడ్ విధినిర్వహణలో ప్రభుత్వోద్యోగి మరణిస్తే ప్రభుత్వం అండగా ఉండేలా కూడా విధానాన్ని రూపొందించాలని కోరారు. హెల్త్ హబ్లకు సంబంధించి.. మూడేళ్లలో పూర్తిచేసేలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రూ.వంద కోట్లు పెట్టుబడితో ఎవరు ముందుకు వచ్చినా జిల్లా కేంద్రాల్లోనూ.. కార్పొరేషన్లలోనూ ఒక్కొక్కరికీ ఐదెకరాల చొప్పుడు ప్రభుత్వం భూమి ఉచితంగా ఇస్తుందని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఆస్పత్రులన్నీ ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

Share this on your social network: