ట్రస్టు భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్టు భూములపై కొందరు ప్రభుత్వ పెద్దలు కన్నుపడింది. వాటిని దక్కించుకోవడంలో భాగంగానే ఏడాదిన్నర క్రితం ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించారు. ఆ కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న సంచయితకు పట్టం కట్టారు. మాన్సా్సకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దాదాపుగా 13వేల ఎకరాల భూములు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి? ఎవరి నుంచి ఎవరికి దఖలు పడ్డాయనే విషయలు తెలుసుకోవడానికి వైసీపీ పెద్దలు యత్నించారు. అయితే ట్రస్టు కార్యాలయం విజయనగరం కోటలో ఉండటం, రికార్డులన్నీ రాజవంశీయులకు నమ్మకమైన సిబ్బంది చూస్తుండడంతో వారు ఆశించిన వివరాలు దక్కలేదు. దాంతో ట్రస్టు కార్యాలయాన్ని ఏకంగా విశాఖ జిల్లా పద్మనాభానికి తరలించారు. వాటి ఆనుపానులు గుర్తించడానికి రంగం సిద్ధమైన సమయంలో హైకోర్టు తీర్పుతో మళ్లీ అశోక్ గజపతిరాజు ట్రస్టు బాధ్యతలు చేపట్టారు. ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో వచ్చిన ఈ తీర్పు సదరు పెద్దలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో సహనం కోల్పోయి... అశోక్ గజపతిరాజే భూములు కాజేశారంటూ ఆరోపణలకు దిగారు. ఆయన ట్రస్టు భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని ఆరోపించారు. ట్రస్టు లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులే ఈ డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
విశాఖ జిల్లాలో దేవదాయ శాఖ సమీక్ష అంటూ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో బుధవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు హాజరయ్యారు. అయితే సమావేశంలో సమీక్ష అంతా ఎంపీ విజయసాయిరెడ్డే చేశారు. జిల్లాలో దేవదాయ అంశాలపై ఇక్కడి అధికారి వివరించిన తరువాత... ఆ సమీక్షకు ఫుల్స్టాప్ పెట్టి విజయనగరం జిల్లాకు చెందిన మాన్సాస్ ట్రస్టుపై సమీక్ష ప్రారంభించారు. ఆ ట్రస్టు ఈఓను ఊపిరి సలపకుండా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. భూములు ఎన్ని ఉన్నాయి? ఆడిట్ ఎలా జరిగింది? కొన్ని భూములు విక్రయించారట? కొన్ని భూములు బినామీల పేరుతో రిజిస్టర్ చేశారట? కొన్ని ప్రాంతాల్లో ట్రస్టు భూములకు మ్యుటేషన్ జరుగుతోందట? ఇవన్నీ ఎలా చేస్తున్నారు?... అంటూ సాయిరెడ్డి ప్రశ్నలు కురిపించారు. రెవెన్యూ శాఖ నుంచి ఆ ట్రస్టు ఈవోగా కొన్ని నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి తనకు ఆ వివరాలు ఏమీ తెలియవని చెప్పడంతో సాయిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలని స్పష్టం చేశారు. దేవదాయ కమిషనర్ అర్జునరావు, జిల్లా కలెక్టర్ వినయ్చంద్ కల్పించుకొని, రెవెన్యూ, దేవదాయ శాఖ రెండూ కలసి వివరాలు సేకరిస్తామని, 15 రోజుల్లో నివేదిక ఇస్తామని హామీ ఇచ్చారు.
- మాన్సాస్ ట్రస్టుకు చాలాకాలంగా ఆడిటింగ్ జరగలేదు. ఇపుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి.
- పీవీజీ రాజు(అశోక్ తండ్రి) పేరుతో ఉన్న భూములు ఆ తరువాత వేరే వ్యక్తుల పేరు మీదకు మార్చారని సమాచారం ఉంది. ఆ వివరాలు వెలికి తీయాలి.
- దేవదాయ ఆస్తుల నిర్వహణకు సంబంధించి 1987లో వచ్చిన కొత్త చట్టం ప్రకారం 38వ నం బరు రిజిస్టర్లను 43వ నంబరు పేరుతో నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రక్రియ చట్టం వచ్చిన వెంటనే జరగాల్సి ఉండగా మాన్సా్సలో 2010లో మొదలైంది. అంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఆ స మయంలో కొన్ని భూములు తప్పించేశారని స మాచారం ఉంది. ఆవివరాలు బయటకు తీయాలి.
- బొబ్బిలి వేణుగోపాలస్వామికి చెందిన కొన్ని ఆస్తులు మాన్సా్సకు రాసిచ్చారు. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ట్రస్టు 1958లో ఏర్పాటైతే, భూముల బదిలీ 1957లోనే జరిగిందని తెలిసింది. దీనిపై నివేదిక కావాలి.
- మెడికల్ కాలేజీ నిర్మాణం కోసమంటూ 2015లో మాన్సాస్ ట్రస్టు 200 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించింది. దానికి అనుమతులు లేవు. అందులో జరిగిన తప్పులపై వివరాలు కావాలి అంటూ విజయసాయిరెడ్డి అధికారులను ఆదేశించారు.

Share this on your social network: