12 రాష్ట్రాల్లో 51 డెల్టా ప్లస్ గుర్తింపు

డెల్టా ప్లస్ వేరియంట్ దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోంది. ఇన్నాళ్లుగా నాలుగైదు రాష్ట్రాలకే పరిమితమైన డెల్టా ప్లస్ కేసులు.. రోజురోజుకూ కొత్త రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. శుక్రవారంనాటికి 12 రాష్ట్రాల్లో 45 వేల నమూనాలకు జీన్సీక్వెన్సింగ్ చేయగా.. 51 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 22 కేసులు.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్లో 7 కేసులు వెలుగుచూశాయి. కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు.. ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్, హరియాణా, కర్ణాటకల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే.. గత మూడు నెలల్లో 12 జిల్లాల్లో దాదాపు 50 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి కాబట్టి.. డెల్టా ప్లస్ కేసులు పెరిగే ట్రెండ్లో ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజీత్సింగ్ తెలిపారు. ఆందోళన కారక వేరియంట్ అయిన డెల్టాకు.. మరో ఆందోళన కారక వేరియంట్ అయిన బీటా (దక్షిణాఫ్రికా) వేరియంట్లోని కే417ఎన్ మ్యుటేషన్ తోడై ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చిందని వివరించారు. ప్లస్ అంటే దీని తీవ్రత ఎక్కువని అర్థం కాదని.. అలాంటిదేదైనా ఉందని పరిశోధనల్లో తేలితే ఆ విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
సిద్ధం కండి..
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఎందుకంటే.. సెకండ్వేవ్లో మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిన కొద్దిరోజులకే తెలంగాణలోనూ వేగంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో.. అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య అధికారులను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు అప్రమత్తం చేశారు. కొవిడ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్ష తగ్గకుండా చేయాలని సూచించారు. ఈ వేరియంట్ సోకినవారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆస్పత్రుల్లో ప్రాణవాయువు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 130 (డీఎంఈ, టీవీవీపీ) ఆస్పత్రుల్లో 27,141 పడకలను వైద్య శాఖ సిద్ధం చేసింది. అందులో 10,224 బెడ్స్కు ఆక్సిజన్ లైన్ ఏర్పాటు చేయగా, మిగిలిన 16,917 పడకలకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. యంత్ర పరికరాలు, ఔషధాలను ఇప్పటికే సమకూర్చి పెట్టుకున్నట్లు తెలిపారు. అటు.. మహారాష్ట్రలో థర్డ్ వేవ్లో ఐదు లక్షల మంది పిల్లలు సహా 50 లక్షల మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే ఆందోళన వ్యక్తం చేశారు. మూడో వేవ్ పతాకస్థాయిలో ఎనిమిది లక్షల యాక్టివ్ కేసులు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఐదు లక్షల మంది పిల్లల్లో 2.5 లక్షల మందికి ఆస్పత్రి చికిత్స అవసరమవుతుందని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. థర్డ్వేవ్, డెల్టా ప్లస్ ముప్పు నేపథ్యంలో మహారాష్ట్ర.. మళ్లీ లెవెల్-3 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచి, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Share this on your social network: