కరోనా నుంచి బయటపడడానికి ‘వ్యాక్సినేషన్’ ఏకైక మార్గo

కరోనా నుంచి బయటపడడానికి ‘వ్యాక్సినేషన్’ ఏకైక మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి నుంచి తాము దేశంలో డిజిటల్ వ్యూహాన్ని అనుసరించాలనే తాము వ్యూహం పన్నామని అన్నారు. సోమవారం ‘కొవిన్ అంతర్జాతీయ సదస్సు’ జరిగింది. దీనిలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టేందుకు భారత్ వినియోగిస్తున్న డిజిటల్ వేదికే కొవిన్. కరోనాపై పోరులో భాగంగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను దాదాపు 50 దేశాలకు ఉచితంగా అందించేందుకు భారత్ సిద్ధమైంది. దేశ విదేశాలకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విధానాన్ని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారని, మహమ్మారి తర్వాత చాలా మంది విదేశీయులు కూడా ప్రస్తుతం ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే కొవిన్ టెక్నాలజీని విశ్వవ్యాపితం చేయడానికి ఓపెన్ సోర్స్గా ఉంచినట్లు మోదీ తెలిపారు. కోవిడ్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాంకేతికత అంతర్గతంగా చాలా పాత్ర పోషించిందని, టెక్నాలజీలోని వనరులను వాడుకోవడానికి ఓ పరిమితి అంటూ లేదని, ఈ అంశం బాగా కలిసొచ్చిందని అన్నారు. అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్ను ఓపెన్ సోర్స్ చేసేశామని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నట్లు మోదీ ప్రకటించారు. వందేళ్లలో ఇంత పెద్ద మహమ్మారి ఏదీ లేదని, కరోనాకు దేశ, విదేశం అన్న తేడా లేదని మోదీ పేర్కొన్నారు.

Share this on your social network: