చనిపోయిందని తేల్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా..

ప్రసవ సమయంలోనే ఆ చిన్నారి చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన తల్లిదండ్రలు, బంధువులు ఆ చిన్నారి మృతదేహాన్ని ప్యాక్ చేసుకుని స్మశానికి తీసుకువెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి చిన్నారిని బయటకు తీయగా తనలో కదలిక కనిపించింది. శ్వాస తీసుకుంటోంది. దీంతో వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. తమిళనాడులోని థేని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
థేనికి చెందిన ఓ మహిళకు ఆరు నెలలకే నొప్పులు రావడంతో సోమవారం థేని మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. నెలలు నిండకుండా నొప్పులు రావడంతో ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. 700 గ్రాముల బరువు మాత్రమే ఉన్న ఆ బిడ్డలో ఎలాంటి కదలికా కనిపించలేదు. శ్వాస కూడా తీసుకోలేదు. దీంతో ఆ చిన్నారి ప్రసవ సమయంలోనే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకెళ్లగా అక్కడ ఆ చిన్నారిలో కదలిక కనిపించింది. దీంతో వెంటనే ఆ చిన్నారిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ చిన్నారిని పరిక్షించిన వైద్యులు ఐసీయూలో ఉంచారు. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి ఆక్సిజన్ అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై హాస్పిటల్ ఛీఫ్ దర్యాఫ్తునకు ఆదేశించారు. ఆ చిన్నారిని మొదట పరీక్షించిన వైద్యులు, నర్సులను విచారిస్తున్నారు.

Share this on your social network: