అమరావతి రాజధాని భూముల కొనుగోలుపై సుప్రీంలో వాదనలు

అమరావతి రాజధాని భూముల కొనుగోలుపై సుప్రీంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే సొంత మనుషులకు చెప్పి.. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. ప్రాథమిక దర్యాప్తును నిలిపివేసే అధికారం హైకోర్టుకు లేదని కోర్టుకు విన్నవించారు. ఆస్తుల కొనుగోలులో అధికారులు, నేతలు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్నారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు అన్ని కోణాలను పరిశీలించి తీర్పు ఇచ్చిందని పేర్కొంది. రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని, భూములు అమ్మినవాళ్లు మోసపోయామని ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అని అడిగింది. నష్టం వచ్చిన వాళ్లే కోర్టును ఆశ్రయించాలి కానీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తమ వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే సమయం కోరారు. ఈ కేసును సిట్ కేసుతో జతపర్చాలన్న దవే అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

Share this on your social network: