ప్రపంచ వాతావరణ మార్పుల్లో వేగం

భూగోళం అత్యంత వేగంగా వేడెక్కుతోందని.. ఊహించిన దానికంటే తీవ్రంగా ఈ దుష్పరిణామం ఆందోళనకరంగా మారుతోందని వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) హెచ్చరించింది. మానవ తప్పిదాలతో జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం ఉష్ణోగ్రతలు, సముద్రాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి, వేడిగాలులపై తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రభావంతో భారత్లో అతి వర్షాల కారణంగా భవిష్యత్లో వర్షపాతం భారీగా పెరుగుతుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను కట్టడి చేయకుంటే.. తరచూ ప్రకృతి వైపరీత్యాలు తథ్యమని హెచ్చరించింది. 234 మంది శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ నివేదికపై గత నెల 26 నుంచి రెండు వారాల పాటు 195 సభ్య దేశాల ప్రతినిధులతో వర్చువల్గా చర్చించిన ఐపీసీసీ.. సోమవారం 3 వేల పైచిలుకు పేజీల ‘సిక్స్త్ అసె్సమెంట్ రిపోర్ట్(ఏఆర్-6) క్లైమేట్ చేంజ్ 2021: ద ఫిజికల్ సైన్స్ బేసిస్’ నివేదికను విడుదల చేసింది.
గతంలో, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, వాతావరణం, మార్పులపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాక ఈ నివేదికను విడుదల చేసినట్లు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఈ నివేదికను బట్టి.. వాతావరణ మార్పులు మానవాళి పాలిట ‘కోడ్ రెడ్’ స్థాయికి చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2013 నాటి ఏఆర్-5 నివేదిక తర్వాత.. ఊహించినదానికంటే ఎక్కువ వేగంగా భూతాపంపెరిగిపోతోందని ఐపీసీసీ చెబుతోంది. ఊహించినదానికంటే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2013 నాటి నివేదిక ప్రకారం.. 2050 కల్లా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని భావిస్తే.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది 2030లోగా జరగనుందని వివరించింది. ఇప్పటికే 1.1 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం భవిష్యత్లో మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమించనుందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. 1901-71 మధ్యకాలంలో సముద్ర మట్టం ఏడాదికి 1.3 మిల్లీమీటర్ల చొప్పున పెరిగేదని, 2006-18 కాలంలో అది 3.7 మిల్లీమీటర్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ధ్రువప్రాంతాల్లోని ‘శాశ్వత’ మంచుకొండలు కూడా కరిగిపోతున్నాయని, దీని వల్ల భవిష్యత్లో సముద్రమట్టాలు వేగంగా పెరుగుతాయని హెచ్చరించింది. ఇక భూతాపంతో ప్రకృతి వైపరీత్యాల్లోనూ వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఈ నివేదిక తెలిపింది. 1950 వరకు ప్రతి 50 ఏళ్లకు ఒకసారి వేడిగాల్పులు, అతి వర్షాలు ప్రతాపం చూపేవని గుర్తుచేసింది. ఆ తర్వాత అవి ప్రతి దశాబ్దానికి ఒకసారి వస్తున్నాయని, ఇప్పుడు దశాబ్దానికి 1.3 సార్లుగా మారిందని వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రతి ఏడేళ్లలో రెండుసార్లు సంభవించే ప్రమాదముందని పేర్కొంది. వేడిగాలుల్లో పెరుగుదల ఉండగా.. చల్లగాలుల్లో తీవ్రస్థాయిలో తగ్గుదల నమోదవుతోందని తెలిపింది. సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు కోతకు గురవుతాయని చెప్పింది.
2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు తూ.చ. తప్పకుండా అమలు చేయాలి. అందులో పేర్కొన్న ఐదు ప్రధానాంశాలపై దృష్టిసారించాలి. వీలైనంతగా కర్బన, మిథేన్, నైట్రస్ వంటి ఉద్గారాల విడుదలను తగ్గించాలి. ఉష్ణోగ్రత పెరుగుదలను 2030 కల్లా 1.5 డిగ్రీలలోపే పరిమితం చేస్తే.. మానవాళి మనుగడకు కొంత మేర ప్రమాదం తప్పుతుంది. గ్రీన్హౌస్ ఉద్గారాలలో కనిపిస్తున్న తరుగుదలను కొనసాగించాలి. అన్ని రకాల కాలుష్యాలను నియంత్రించాలి. పకడ్బందీ చర్యలు తీసుకుంటే.. 2040కల్లా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగే ప్రమాదాలు రెండింట మూడొంతులు ఉంటాయని, అయినా.. ఒకటింట మూడోవంతు ప్రపంచ దేశాల చేతుల్లో ఉంది. 2015 పారిస్ ఒప్పంద సమయంలో 100కు పైగా దేశాలు చేసిన ‘అనధికారిక’ ప్రతిజ్ఞల మాదిరిగా కాకుండా.. అత్యంత కష్టమైన సవాళ్లను ఎదుర్కోవాలని ఐపీసీసీ సూచించింది. కాగా, వాతావరణ మార్పులపై శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ. దీన్ని 1988లో ఐరాస పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా నెలకొల్పాయి. వాతావరణ మార్పులపై ఈ సంస్థ అధ్యయనాలు చేపట్టి.. నివేదికలు ఇస్తుంది.
భూతాపం కారణంగా జరిగే మార్పులతో భవిష్యత్లో అతి వర్షాల సంభవించి, భారత్లో వర్షపాతం పెరుగుతుందని ఐపీసీసీ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు చోటుచేసుకుంటాయని వివరించింది. సముద్ర మట్టం పెరగడం వంటి పరిణామాలు కూడా భారత్పై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయని పేర్కొంది. ‘‘భారత్లో మొత్తం 7,517 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సముద్రం మట్టం పెరగడం వల్ల ఏర్పడే నేలకోత ప్రభావం ఓడరేవులున్న విశాఖపట్నం, చెన్నై, కోచి, కోల్కతా, ముంబై, సూరత్ నగరాలపై తీవ్రంగా పడనుంది. సముద్ర మట్టం ఒకవేళ 50 సెంటీమీటర్లు పెరిగినా.. ఈ ప్రాంతాల్లో సముద్రాలకు దగ్గరగా నివసించే 2.86 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు’’ అని ఈ నివేదికను తయారు చేసిన వారిలో ఒకరైన డాక్టర్ స్వప్న పనిక్కల్ వెల్లడించారు.
ఐపీసీసీ రిపోర్టులని ప్రధాన అంశాలు
1850-1900 మధ్య కాలంతో పోలిస్తే.. 2011-2020 మధ్య కాలంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.09 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగింది.
1850 నుంచి పరిశీలిస్తే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఇది కచ్చితంగా మానవ తప్పిదమే.
1901-71 మధ్య కాలంతో పోలిస్తే.. ఇటీవల సముద్రమట్టం పెరుగుదల రేటు 3 రెట్లు పెరిగింది.
1990 నుంచి హిమనీనదాలు, ఆర్కిటిక్లో మం చు కరిగిపోవడానికి 90% కారణం మానవ తప్పిదాలే.
1950ల నుంచి మంచు తుఫానులు తగ్గాయి. వేడిగాలులు పెరిగాయి. గ్లోబల్ వార్మింగ్కు నిదర్శనమిదే.

Share this on your social network: