పట్టణాల నుంచి పశువైద్యుల డైలీ సర్వీస్.

మూగ జీవాలకు వైద్యం చేయాల్సిన పశువైద్యుల్లో కొంతమంది తమ విధులను విస్మరిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందితోనే పశువులకు వైద్యం చేయిస్తున్నారు. ఎక్కువ శాతం పశువైద్యులు స్థానికంగా నివాసమే ఉండటం లేదు. గ్రామాల్లో ఉండకుండా పట్టణాల నుంచి డైలీ సర్వీస్ చేస్తున్నారు. డిస్సెన్సరీల్లో వైద్యమంతా నాన్గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్(ఎన్జీవీ)లతోనే సాగుతోంది. రోజు వారీ విధుల్లో సాధారణంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు(వీఏఎస్) చేయాల్సిన కృత్రిమ గర్భధారణ చికిత్సలు, వ్యాధినిరోధక టీకాల వంటి పనుల్ని కూడా చాలాచోట్ల ఎన్జీవీలు, పశుసంవర్ధకశాఖ సహాయకులు(ఏహెచ్ఏ), గోపాలమిత్రలతోచేయిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పనులను ఏహెచ్ఏలు నిర్వహిస్తున్నారు. మొక్కుబడిగా ఉద్యోగం చేస్తున్న కొందరు పశువైద్యులు.. ఉన్నత విద్య(పీజీ, పీహెచ్డీ) కోసం దీర్ఘకాలం సెలవులు తీసుకుంటున్నారు. దీంతో వెటర్నరీ డాక్టర్ పోస్టులను ఇన్చార్జులతో నడిపిస్తున్నారు. ఆయా డిస్పెన్సరీల్లో ఎన్జీవీలే వైద్యసేవలు అందిస్తున్నారు.
పదోన్నతుల కోసమే అప్గ్రెడేషన్..
రాష్ట్రంలో 1977 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 1,500 పైచిలుకు వెటర్నరీ సబ్సెంటర్లను ఏర్పాటు చేశారు. తర్వాత వాటిని ఆర్ఎల్యూ(గ్రామీణ పశుగణ కేంద్రాలు)గా పేరు మార్చారు. ఎన్జీవీలతో తక్కువ ఖర్చుతో నడుస్తున్న ఆర్ఎల్యూలను అనంతరం డిస్పెన్సరీలుగా అప్గ్రేడ్ చేశారు. 2008 నుంచి 2016 వరకు మూడు విడతల్లో 1606 ఆర్ఎల్యూలను డిస్పెన్సరీలుగా అప్గ్రేడ్ చేశారు. అప్పటికే ఉన్న 183 ఏడీ పోస్టులతో పాటు క్లాస్ ఏబీసీ పేరిట అదనంగా 335 ఏడీ పోస్టులను, 360 వీఏఎస్ పోస్టులను పెంచారు. క్లాస్ ఏబీడీ పేరిట డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను, ఏబీడీ పేరిట 11 జాయింట్ డైరెక్టర్ పోస్టులను, ఒక అడిషనల్ డైరెక్టర్ పోస్టును పెంచారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని చెప్తున్నారు. వీఏఎ్సల పదోన్నతుల కోసం తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు ఏడీలు అప్పటి ఉన్నతాధికారితో కుమ్మక్కై రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థను మార్చారు.
పదోన్నతుల కోసం అప్పుడు పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు విమర్శలొచ్చాయి. జీవో 126 ప్రకారం 94 క్లాస్-4 పోస్టులను ప్రభుత్వానికి సరెండర్ చేసి, పదోన్నతుల కోసం అప్పటి ప్రభుత్వం కళ్లు గప్పి, జీవో 45 ద్వారా 980 గెజిటెడ్ పోస్టులను సృష్టించారు. వీటివల్ల పశుపోషకులకు ఒరిగింది శూన్యం. ఈ వ్యవహారంపై ఇప్పటికీ విచారణ జరగలేదు. గతంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉండే ఏడీలను 2-3 మండలాలకు పరిమితం చేశారు. కొందరు ఏడీలు, వీఏఎ్సలు రిపోర్టులు, మీటింగులు, పరిపాలనకే పరిమితమౌతుండటంతో ఏరియా ఆస్పత్రుల్లో పశువైద్యాన్ని ఎక్కువ శాతం ఎన్జీవీలే నిర్వహిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వీఏఎ్సలకు పదోన్నతులు కల్పించడం తప్ప, ఏరియా ఆస్పత్రుల్లో కొత్తగా పెంచిన వైద్యసేవలు పెద్దగా లేవు. ప్రభుత్వ పథకాల పనులను ఎన్జీవీలతో చేయిస్తే, వీఏఎ్సలే చేస్తున్నట్లు నివేదికలు పంపుతున్నారని చెబుతున్నారు. కాగా, దీర్ఘకాలంగా పని చేస్తున్న తమకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని అడుగుతున్నా, ఆలకించిన నాథుడే లేడని ఎన్జీవీలు వాపోతున్నారు.

Share this on your social network: