రబీ పంటల ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను కేంద్రపెంచింది

రైతుల నుంచి సేకరించే రబీ పంటల ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గోధుమల ఎంఎస్పీని 100 కేజీలకు రూ.40 పెంచి, రూ.2,015గా నిర్ణయించింది. గోధుమల ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ.1,008గా అంచనా వేసింది. అదే విధంగా ఆవాలు క్వింటాలుకు రూ.400 చొప్పున పెంచి, రూ.5,050గా నిర్ణయించింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
2020-21 క్రాప్ ఇయర్లో క్వింటాలు గోధుమలకు ఎంఎస్పీ రూ.1,975 అని, దీనిని రూ.40 పెంచి, రూ.2,015గా నిర్ణయించినట్లు సీసీఈఏ తెలిపింది. బార్లీ ఎంఎస్పీని క్వింటాలుకు గత ఏడాది కన్నా రూ.35 పెంచుతూ, రూ.1,635గా నిర్ణయించినట్లు తెలిపింది.
శనగపప్పు ఎంఎస్పీని క్వింటాలుకు రూ.5,230గా నిర్ణయించింది. ఇది అంతకు ముందు కన్నా రూ.130 ఎక్కువ. పెసలు, ఉలవలు వంటి పప్పుల ఎంఎస్పీని క్వింటాలుకు రూ.400 పెంచి, రూ.5,500గా నిర్ణయించింది. క్వింటాలు కుసుమలకు ఎంఎస్పీని రూ.114 పెంచి, రూ.5,327గా నిర్ణయించింది.
రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందాలనే లక్ష్యంతో 2022-23 రబీ మార్కెటింగ్ సీజన్లో రబీ పంటల ఎంఎస్పీని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సగటు ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 1.5 రెట్లు ఎక్కువ ఉండేవిధంగా ఎంఎస్పీని నిర్ణయిస్తామని 2018-19 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం 2021-22 రబీ మార్కెటింగ్ సీజన్లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 43 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించింది.

Share this on your social network: