నూతన డీఎస్ఆర్ యాప్తో కష్టాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త డీఎస్ఆర్ యాప్ను పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఇన్స్టాల్ చేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. పనిచేసే ప్రాంతంలో ఉదయం 8గంటలకే ఉండాలంటే ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు. మరికొన్ని నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయంటున్నారు. అయితే సాంకేతికంగా సవరించిన ఈ కొత్త యాప్ను ఇప్పటికే కార్యదర్శులు వినియోగించడం మొదలుపెట్టాలి. కానీ మెజారిటీ కార్యదర్శులు నిరాకరిస్తున్నారు. అసలే పనిభారంతో సతమతమవుతున్న తమకు ఇది అదనపు భారమవుతుందని వాపోతున్నారు. పైగా ఈ యాప్లోని సాంకేతికత పెద్ద సంకటంగా మారునున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే ప్రభుత్వం ఒక యాప్ను అమలులోకి తెచ్చింది. గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంతో సహా పల్లె ప్రగతి పనులను కార్యదర్శులు ఇందులో నమోదు చేస్తున్నారు. పల్లె ప్రగతి పనులు, పరిపాలన, వీధుల శుభ్రం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు ఇలా ప్రతీ సమాచారాన్ని ప్రస్తుత డీఎస్ఆర్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఈ యాప్ను మార్చారు. కొత్త ఆప్షన్లను ఇందులో చేర్చారు. కొత్త డీఎస్ఆర్ యాప్ను ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కానీ చాలామంది ఇంకా చేసుకోలేదు. దీనిని వినియోగించడానికి నిరాకరిస్తున్నారు. పాత యాప్నే కొనసాగించాలని కోరుతున్నారు. సోమవారం నుంచి దీనిని కార్యదర్శులు వాడకంలోకి తేవాలి. కొంత మంది మాత్రమే యాప్ను ఇన్స్టాల్ చేసుకోగా చాలామంది ససేమిరా అంటున్నారు.
పంచాయతీ కార్యదర్శుల సెల్ఫోన్లో ఇదివరకు ఉన్న పాత యాప్ను తొలగించి కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి అనుసంధానం చేయాలి. ఇది ఆ కార్యాలయ ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పని చేస్తుంది. ఆ తర్వాత రోడ్లు, వీధులు తదితర 5 ఫొటోలు అప్లోడ్ చేయాలి. పాత తేదీన తీసిన ఫొటో అయితే అప్లోడ్ కాదు. పంచాయతీ కార్యదర్శులు కచ్చితంగా లోకేషన్లో ఉండి పనిచేసేలా ఈ యాప్ను తిర్చిదిద్దారు. దీని ప్రకారం కార్యదర్శులు కచ్చితంగా ఉదయం 8గంటలలోపు హాజరును ఈ యాప్లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అది తెరుచుకోదు. స్వీయ చిత్రం తీసుకుంటేనే హాజరు నమోదవుతుంది. తర్వాత డెయిలీ శానిటేషన్ రిపోర్టును ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
కొత్త విధానంతో కార్యదర్శులు సంకట స్థితిలో పడ్డారు. పంచాయతీ కార్యదర్శులు ఎవరూ స్థానికంగా నివాసం ఉండడం లేదు. నివాసిత ప్రాంతానికి దూరంగా ఉన్న పం చాయతీల్లో విధులు నిర్వహిస్తున్నవారు తెల్లవారుజామునే లేచి బయల్దేరితే తప్ప 8గంటలలోపు కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు.
మహిళా కార్యదర్శుల బాధలు వర్ణణాతీతం. వేళాపాలా లేకుండా కుటుంబాలకు దూరంగా విధు లు నిర్వహించాల్సి రావడంతో లోలోన కుమిలిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సెల్ఫోన్ సంకేతాలు సరిగా అందని పంచాయతీలు దాదాపు 560 వరకు ఉన్నాయి. అక్కడ ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ విధానం ఇబ్బందికరంగా మారనున్నది.
కొత్త యాప్ను మెడమీద కత్తిలాంటిదని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు పనులు తామే చేస్తున్నామనీ, పాఠశాలలో స్వీపర్లను తొలగించడంతో తమ సిబ్బంది ద్వారా పనిచేయించాల్సి వస్తోందంటున్నారు. ఊర్లో అన్ని సమస్యలను చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, పైస్థాయి అధికారులు వచ్చినా ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
ప్రజలకు మరింత పారదర్శకంగా పాలన అందించేందుకే ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1689 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. హనుమకొండ జిల్లాలో 208, వరంగల్ జిల్లాలో 323, జనగామ జిల్లాలో 282, మహబూబాబాద్ జిల్లాలో 461, ములుగు జిల్లాలో 174, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 241 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Share this on your social network: