ఐ అండ్ పీఆర్లో ప్రకటనల కుంభకోణంపై... విజయశాంతి

తెలంగాణ ప్రభుత్వంలోని ఐ అండ్ పీఆర్ విభాగంలో ప్రకటనల కుంభకోణం గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని జతచేస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
‘‘ఏ దోపిడీ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ఎంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో... ఆ పోరాటయోధులు, అమరవీరుల త్యాగాలు, ఆత్మార్పణలకు ఏ మాత్రం విలువ లేకుండా ఉమ్మడిరాష్ట్ర కాలపు అక్రమాల పరంపరను నేటి తెలంగాణ పాలకులు జంకూ గొంకూ లేకుండా కొనసాగించారనడానికి మరో తిరుగులేని సాక్ష్యాన్ని మీడియా బయటపెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా గడవకముందే 2015 నుంచి రెండేళ్ళ పాటు I&PR (సమాచార ప్రజా సంబంధాల) విభాగంలో కొనసాగిన అవినీతి వారసత్వం బట్టబయలైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరు చెప్పి... విదేశీ అడ్వర్టయిజింగ్ కంపెనీ WPP భారతీయ విభాగాల (JWT Mindset Advt.)తో కుమ్మక్కై వీసమెత్తు ప్రచారం కూడా చెయ్యకుండా అందరూ కలసి మొత్తంగా సుమారు రూ.12 కోట్లు... పత్రికల్లో యాడ్స్ అంటూ మరి కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు ఈ కథనం ఆధారాలతో సహా వివరాలిచ్చింది. ఈ సొమ్ములో రూ.7.5 కోట్లు డీఐపీఆర్ అధికారుల వాటాగా ఇచ్చినట్లు JWT Mindset నివేదిక ద్వారా తెలిసింది. కలకలం రేపుతున్న మరో విషయం ఏమిటంటే, ఈ డబ్ల్యూపీపీ సంస్థ పలు దేశాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడినప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రధానంగా తెలంగాణలోనే అవినీతికి పాల్పడినట్లు ఆ వార్తా కథనం స్పష్టం చేసింది. దీన్ని బట్టి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థమవుతూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ పాలకులకు సంబంధం లేదంటే పసిపిల్లలు కూడా నమ్మరు. తెలంగాణలో పాలనా పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ అధికార పార్టీ వారి అవినీతి, అక్రమాల చిట్టా పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఇలా ఏర్పడిందో లేదో... ఆ మరు క్షణం నుంచే అవినీతి మెట్లెక్కుతూ... అక్రమాల పుట్టలు కడుతూ ప్రజల్ని మోసగించిన వైనం చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.’’ అంటూ విజయశాంతి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

Share this on your social network: