గ్రంథ పఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలి
‘మంచి స్నేహితుడెవరంటే.. మంచి పుస్తకం అని పెద్దలు చెప్పారు. గ్రంథ పఠనం ప్రజాఉద్యమ రూపుదాల్చి.. మరోసారి గ్రంథాలయ ఉద్యమం పుట్టుకురావాలి. ఊరికో గ్రంథాలయం.. ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని చారిత్రక రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సంఘ సంస్కర్త రాజారామ్మోహన్రాయ్ పేరుమీద వందేళ్ల క్రితం ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ఇప్పటికీ చక్కగా నిర్వహిస్తుండటం ముదావహం. ప్రాచీన గ్రంథాలు, తెలుగు, ఆంగ్ల భాషల్లో సాహిత్యాన్ని అందించడం, మహనీయుల చరిత్రను తెలిపే పుస్తకాలను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషం. నా చిన్నప్పుడు ఈ గ్రంథాలయంలో పైన ఉన్న హాలులో సమావేశాలు నిర్వహించడానికి వస్తుండేవాడిని. సమైక్య భారతావని కోసం కృషిచేసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ గ్రంథాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న పద్ధతి అభినందనీయం. దీనికి ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్.. అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. తన కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్టు తరఫున రూ.2.5 లక్షలు, తన కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షలు ఈ గ్రంథాలయ అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. అలాగే, ఫేస్బుక్లోనూ ఆ గ్రంథాలయ స్మృతులను పంచుకున్నారు. ‘భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలు జాతి సంపదగా విరాజిల్లాయి. స్వరాజ్య సంగ్రామంతోపాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషించాయి. చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిలించి వికాసానికి నాంది పలికింది. దాదాపు 118 ఏళ్ల చరిత్ర ఉన్న రామ్మోహన్ గ్రంథాలయ సందర్శన ఎంతో ఆనందాన్నిచ్చింది. గాంధీ మహాత్ముని స్మృతుల్ని గుర్తు చేసింది. మహాత్ముడు మూడు పర్యాయాలు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు ఈ సంస్థ కేంద్ర బిందువుగా నిలిచింది. గ్రంథాలయ అభివృద్ధిలో నాటి కార్యదర్శి అయ్యంకి వెంకటరమణయ్య కృషి ప్రశంసనీయమైనది. ఎంతోమంది మహనీయులు చందాలు పోగేసి, అప్పులు చేసి ఈ స్థలాన్ని కొన్న సంఘటన ప్రేరణ కల్గిస్తుంది. యువత తలచుకుంటే చరిత్రగతి మరుతుందన్న విషయాన్ని ఆ ఘటన తెలియజేస్తుంది. నేటి యువత ఈ దిశగా కృషి చేయాలి. ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది చైతన్యం రగిలించేందుకు గ్రంథాలయ ఉద్యమం తోడ్పడింది. ప్రాచీన కాలం నుంచి మన జీవితంలో విప్లవాత్మక మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతున్నాయి. దేశాభివృద్ధికి, సాహిత్య జగతికి, విజ్ఞాన శాస్త్ర పురోభివృద్ధికి, యుద్ధం, శాంతి, దేశ పునర్నిర్మాణ సమయాల్లోనూ గ్రంథాలు సమస్త మానవాళికి అండగా నిలిచాయి. సమస్యల అంధకారం ముప్పిరిగొన్న ప్రతి సందర్భంలోనూ మానవుడిని మహోన్నతునిగా మలచినవి పుస్తకాలే. పుస్తకాలు ఓ మతానికో, కులానికో, వర్గానికో పరిమితం కావు. శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో.. మెదడును చైతన్యం చేయడానికి పుస్తకాలు అంతే ముఖ్యం. టీవీ, ఇంటర్నెట్ సంస్కృతి కారణంగా సమాజంలో క్రమంగా పఠనాసక్తి తగ్గిపోయింది. టీవీలకు పరిమితం కావడం, కంప్యూటర్లో, మొబైల్లో పుస్తకాలు చదివే అలవాటు కారణంగా అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రంథాలయ సంస్కృతిని పెంపొందించుకోవడమే ఈ సమస్యలన్నింటికీ కచ్చితమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, మహోన్నత వారసత్వాన్ని పిల్లలకు పరిచయం చేయడానికి పుస్తక పఠనం పెంపొందించడమే మార్గం. దేశ జనాభాలో 60 శాతానికిపైగా యువతరమే ఉంది. వారిని ఉత్తేజితుల్ని చేసి నవభారత నిర్మాణ సారథులుగా, సమాజాన్ని ముందుకు నడిపే శక్తిచోదకులుగా తీర్చిదిద్దాలంటే ముందు వారిలో విజ్ఞాన బీజాలు నాటాలి. అజ్ఞానం నుంచి విషయ పరిజ్ఞానంతో విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం, దేశం, ప్రపంచం రూపొందుతాయి’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Share this on your social network: