రజతంతో సరిపెట్టుకున్న సింధు

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా క్రీడాకారిణి యాన్ సేయంగ్తో ఈ రోజు జరిగిన ఫైనల్స్లో సింధు పేలవ ప్రదర్శన కనబరించింది.
16-21, 12-21తో వరుస సెట్లలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మ్యాచ్లో తొలి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన సేయంగ్.. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 40 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో సేయంగ్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ టైటిల్ నెగ్గిన తొలి దక్షిణ కొరియా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అంతేకాదు, బాలిలో సేయంగ్కు ఇది వరుసగా మూడో టైటిల్ కావడం గమనార్హం.
గత రెండు వారాల్లో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్ టైటిళ్లను కూడా గెలిచిన సేయంగ్.. సింధును ఓడించి ముచ్చటగా మూడో టైటిల్ను సొంతం చేసుకుంది. సేయంగ్ గొప్ప క్రీడాకారిణి అని, ఆమెతో పోరు అంత ఈజీ కాదని తనకు ముందే తెలుసని సింధు పేర్కొంది. అయితే, తాను మాత్రం స్వర్ణం కోసమే ఆడినట్టు తెలిపింది.

Share this on your social network: