ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కరోనా ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. పండుగల వేళ వ్యాప్తిని అరికట్టేందుకు ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
1. రాత్రి కర్ఫ్యూ విధించాలని, జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడాలని సూచించారు.
2. జిల్లాల్లో నమోదౌతున్న డెల్టా, ఒమైక్రాన్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
3. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుకోవడంతో పాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆక్సిజన్ పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
4. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఉండేలా సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో వివిధ వర్గల వారిని కలుపుకుంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
5. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని కోరారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

Share this on your social network: